సినీ పరిశ్రమను వేధించడం మానుకోవాలి.. ఏపీ సర్కార్ నిర్ణయంపై హీరో సిద్ధార్థ్‌ ఫైర్‌..!

సినీ పరిశ్రమను వేధించడం మానుకోవాలి.. ఏపీ సర్కార్ నిర్ణయంపై హీరో సిద్ధార్థ్‌ ఫైర్‌..!
Siddharth on AP Govt : సినిమా పరిశ్రమ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Siddharth on AP Govt : సినిమా పరిశ్రమ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెనిఫిట్‌ షోలు రద్దు చేయడం, టికెట్‌ రేట్లను తగ్గించడంతో పరిశ్రమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హీరో సిద్ధార్థ్‌ మండిపడ్డారు. వరుస ట్వీట్లతో ఏపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సినిమా టికెట్‌ రేట్లు, ప్రదర్శించాల్సిన షోలపై పరిమితి విధించడం MRTP యాక్ట్‌ ఉల్లంఘనే అన్నారు సిద్ధార్థ్. దయచేసి సినిమా హాళ్లు బతికేందుకు అవకాశం ఇవ్వాలంటూ వేడుకున్నాడు.


తానూ ఫస్ట్ టైం 25 ఏళ్ల క్రితం స్టూడెంట్‌ కార్డు సహాయంతో విదేశాల్లో 8 డాలర్లు పెట్టి సినిమా చూశానని,ఇప్పుడు అక్కడ సినిమా టికెట్‌ రేటు 200 డాలర్లు ఉందన్నారు సిద్ధార్థ్. ప్రస్తుతం మన సినిమాలు ఏ దేశ టెక్నాలజికి తీసిపోవన్నారు. ప్రభుత్వాలు సినిమా కంటే ఆల్కహాల్‌,టొబాకోకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయని, ఈ దురాచారాన్ని ఆపాలంటూ ట్వీట్ చేశారు. సినిమా ద్వారా లక్షలాది మంది న్యాయబద్ధంగా జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు.

తమకు బిజినెస్‌ ఎలా చేయాలో ప్రభుత్వాలు చెప్పక్కర్లేదన్నారు సిద్ధార్థ్. అవసరమైతే పన్నులు విధించుకోవాలని, అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ విధించాలన్నారు. కానీ అశాస్త్రీయంగా నిర్మాతలు, సిబ్బందికి జీవనోపాధిని దూరం చేయోద్దన్నారు. సినిమాలు చూడమని ఎవరిని బలవంతం చేయడం లేదని, చాలా మంది పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారని గుర్తు చేశారు సిద్ధార్థ్‌. ఒక ప్రాంతంలో ఉన్న ఇంటి అద్దె, తలసరి వినియోగ ఖర్చు ఆధారంగానైనా టికెట్‌ రేట్ల నిర్ణయించాలంటూ రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.



ప్రతి రంగంలోనూ బిలియనీర్లు ఉన్నారని, కేవలం సినిమా రంగాన్నే ఎందుకు టార్గెట్‌ చేశారని ప్రశ్నించారు సిద్ధార్థ్‌. సినిమా బడ్జెట్‌, స్థాయిని నిర్ణయించాల్సింది దాని నిర్మాత మాత్రమే కానీ వినియోగదారుడు కాదన్నారు సిద్ధార్థ్‌. పేదరికం నుంచి వచ్చి బిలియనీర్లుగా చనిపోయిన రాజకీయ నాయకులను ఏనాడైనా ప్రశ్నించారా అన్నారు సిద్ధార్థ్‌. సినీ పరిశ్రమను వేధించడం మానుకోవాలన్నారు.

తిండి విలువ, రైతు గొప్పతనం తమకు తెలుసన్నారు సిద్ధార్థ్‌. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. తాము రైతులంతా గొప్పవాళ్లం కాకపోవచ్చన్న సిద్ధార్థ్‌..కానీ తాము టాక్స్ పేయర్స్‌మేనని, మనుషులమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఒక సినిమాను సృష్టించేందుకు తామెంతో కష్టపడి పని చేస్తామని, అలాంటి చేతులను చంపే ప్రయత్నం మానుకోవాలన్నారు సిద్దార్థ్.

Tags

Read MoreRead Less
Next Story