AP News: హైకోర్టు సాక్షిగా జగన్‌ సర్కారు అబద్ధాలు..

AP News: హైకోర్టు సాక్షిగా జగన్‌ సర్కారు అబద్ధాలు..
క్షమాపణలు కోరిన ఏజీ శ్రీరామ్‌

కోర్టు భవనాల మౌలిక సదుపాయాల కోసం తమ వాటాగా 30 కోట్లు జమ చేసేశామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టు సాక్షిగా చెప్పిన మాట అసత్యమని తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పేర్కొంది. కేంద్రప్రభుత్వం మొదటి విడత వాటాగా విడుదల చేసిన 45 కోట్లు, రాష్ట్రప్రభుత్వం వాటా 30 కోట్లు మొత్తం 75 కోట్లను వచ్చే బుధవారంలోపు తమ నియంత్రణలో ఉండే సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ అకౌంట్‌లో జమచేయాలని తేల్చిచెప్పింది.

కోర్టు భవనాల మౌలిక సదుపాయాల కోసం ధర్మాసనానికి చెప్పిన విధంగా సొమ్ము జమచేయనందుకు క్షమాపణలు చెబుతున్నానని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కోర్టుకి నివేదించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరంలో కొత్త కోర్టు భవనాన్ని నిర్మించకపోవడం, పాత కోర్టు భవనానికి కనీస మరమ్మతులు చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ గన్నవరం మండలం వీరపనేనిగూడేనికి చెందిన దేవిరెడ్డి రాజశేఖరరెడ్డి 2022లో హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు... రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణ ప్రాజెక్టుల పరిస్థితులపై దృష్టిసారించింది. కొన్ని భవనాలు అయిదేళ్ల కిందట ప్రారంభమైనా ఇప్పటికి పదిశాతం పనులు పూర్తికాలేదని గత విచారణలో హైకోర్టు అందోళన వ్యక్తం చేసింది.

గతంలో ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వాటాగా 45 కోట్లు విడుదల చేసిందని న్యాయవాది యజ్ఞదత్‌ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రప్రభుత్వం సైతం తన వాటాగా 30 కోట్లు జమచేసిందని ఏజీ తరఫున ప్రత్యేక జీపీ సుమన్‌ తెలిపారు. బుధవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొమ్ము సంబంధిత ఖాతాలో జమకాలేదని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు బిల్లులు అప్‌లోడ్‌ చేస్తే.. సొమ్ము జమ అవుతుందని ప్రత్యేక జీపీ సుమన్‌ తెలిపారు. దీంతో ధర్మాసనం విస్మయం వ్యక్తంచేసింది. సొమ్ము జమ అయ్యిందని గత విచారణలో హైకోర్టు ముందు చెప్పారు కదా? అని ఏజీని ప్రశ్నించింది. అధికారులను అడిగి వివరాలు సమర్పిస్తానని ఏజీ మధ్యాహ్నానికి వాయిదా కోరారు. పాలనపరమైన సమస్యవల్ల జమకాలేదని.. ఆ తర్వాత జరిగిన విచారణలో ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. 45 కోట్లు గంటల వ్యవధిలో సంబంధిత ఖాతాలో జమ అవుతుందన్నారు. మరో 30 కోట్లు 15 రోజుల్లో జమ చేస్తామన్నారు. గత విచారణలోనే 30 కోట్లు జమచేశామని చెప్పారు కదా? ఇంకా జమచేయకపోవడం ఏమిటని ధర్మాసనం విస్మయం వ్యక్తంచేసింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది జూపూడి యజ్ఞదత్‌ వాదనలు వినిపిస్తూ.. తమ వాటా సొమ్ము 45 కోట్లను రాష్ట్ర ఖజానాలో ఇప్పటికే జమచేశామన్నారు. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ వాటా సొమ్ము 45 కోట్లు, రాష్ట్రప్రభుత్వ వాటా 30 కోట్లు రెండు కలిపి ఒకేసారి సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ అకౌంట్‌లో జమచేయాలన్నారు. కేంద్ర వాటా సొమ్మును మాత్రమే జమచేయడానికి వీల్లేదన్నారు. యజ్ఞదత్‌ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కేంద్రప్రభుత్వ వాటాతోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా వాటాను జమచేస్తేనే ఆ సొమ్మును వినియోగించుకోవడానికి వీలుంటుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story