AP: జగన్‌ పక్కన సీబీఐ వెతుకుతున్న నిందితుడు

AP: జగన్‌ పక్కన సీబీఐ వెతుకుతున్న నిందితుడు
తీవ్ర కలకలం రేపుతున్న జగన్ తీరు... సీబీఐకి మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ ప్రశ్నలు

సీబీఐ వెతుకుతున్న ఓ నిందితుడిని సాక్షాత్తు సీఎం జగన్‌ వెంట పెట్టుకుని తిరగడం తీవ్ర కలకలం రేపుతోంది. న్యాయమూర్తులపై అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడు మణి మేమంతా సిద్ధం సభల్లో పాల్గొంటున్నారు. నెల్లూరు జిల్లాలోనూ వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తరఫున మణి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మణి అమెరికాలో ఉన్నారని ఇంటర్‌పోల్‌ సహకారం తీసుకుంటున్నామని కోర్టుకు చెప్పిన సీబీఐ ఇప్పుడు ఎదురుగా తిరుగుతున్నా... పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... సీఎం జగన్‌ సిద్ధం సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఇటీవల వరకూ అమెరికాలో ఉన్న ఆయన ప్రస్తుతం స్వదేశానికి తిరిగొచ్చి నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మణి అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతుంటే ఆయన ఏకంగా సీఎం జగన్‌, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి కులాసాగా ఫొటోలు దిగుతున్నారు. న్యాయమూర్తులను అత్యంత హేయమైన భాషలో దూషిస్తూ, వారికి దురుద్దేశాలు ఆపాదిస్తూ... సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకుగాను, ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబరులో మణి అన్నపురెడ్డితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో కొంతమందిని అరెస్టు చేసింది. మణి అమెరికాలో ఉన్నట్లు గుర్తించి, ఆయన అరెస్టు కోసం సంబంధిత న్యాయస్థానం నుంచి వారంట్‌ సైతం తీసుకుంది.

మణిని అరెస్టు చేసేందుకు మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ, ఇంటర్‌పోల్‌ సహకారం కూడా తీసుకుంటున్నామని సీబీఐ అధికారులు హైకోర్టుకు చెప్పారు. ఆయనపై బ్లూ నోటీసు జారీ చేశామన్నారు. అలాంటి నిందితుడు అమెరికా నుంచి దర్జాగా స్వదేశానికి వచ్చి బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే సీబీఐకి ఎందుకు కనిపించదు..?. ఎందుకు అరెస్టు చేయట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ 6న నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్‌ పాల్గొన్న మేమంతా సిద్ధం’ సభకు హాజరైన మణి అన్నపురెడ్డి అలియాస్‌ శివ అన్నపురెడ్డి... డయాస్‌ పాస్‌ పెట్టుకుని ఏకంగా ర్యాంప్‌పై తిరిగారు. అక్కడ తీసుకున్న ఫొటోలను మేమంతా సిద్ధం అంటూ ఫేస్‌బుక్‌లో పెట్టారు. సీఎం జగన్‌ చేతిలో చెయ్యేసి, నెల్లూరు ఎంపీ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి ఆయన తీసుకున్న ఫొటోనూ అదే రోజు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పేరు, రూపం రెండూ మార్చేస్తే ఉనికి చిక్కకుండా ఉంటుందనే ఎత్తుగడతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story