AP: మధ్యంతర భృతికి మంగళం పాడిన జగన్‌ సర్కార్‌

AP: మధ్యంతర భృతికి మంగళం పాడిన జగన్‌ సర్కార్‌
ఐఆర్‌ తక్కువ ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని దాటవేత … ‘చలో విజయవాడ’ యథాతథం: ఏపీ ఐకాస ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి-I.R. ఇచ్చే పద్ధతికి జగన్‌ సర్కార్‌ మంగళం పాడింది. ఈ ప్రభుత్వం అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. కానీ, జులైలో ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు తాజాగా హామీ ఇచ్చింది. సాధారణ ఎన్నికల ముందు -I.R. తక్కువగా ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మరింత పెరుగుతుందని మధ్యంతర భృతి ఇవ్వకుండా దాటవేసింది. దీన్ని సమర్థించుకునేందుకు జులైలో ఏకంగా పీఆర్సీనే ఇచ్చేస్తామనే హామీని తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 12వ పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఎక్కడైనా నాలుగు నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తయి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందా? ఇప్పుడు I.R. రాకపోతే దాదాపు ఏడాదికిపైగా నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.


ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు నిర్వహించింది. 11వ పీఆర్సీ సమయం గతేడాది జూన్‌తో ముగిసింది. జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులు ఐఆర్‌ అడగ్గా పీఆర్సీయే ఇచ్చేస్తాం కదా అంటూ మంత్రి బొత్స చెప్పుకొచ్చారు. గురుకులాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్ల వర్తింపుపై వారు కోర్టు కేసు ఉపసంహరించుకున్నాక ఆలోచిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపులపై గత చర్చల్లో ఇచ్చిన హామీలనే మళ్లీ వల్లెవేసింది.

ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా హామీలేమీ లభించలేదు. ఏపీ ఐకాస ఈ నెల 27న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’ను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. హామీలేమీ ఇవ్వనందున ఈ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ఏపీ ఐకాస ప్రకటించింది. 2004 సెప్టెంబరుకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్‌ విధానం అమలు తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరినా ప్రభుత్వం దాటవేత వైఖరినే అవలంబించింది. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్‌ 70, 75 ఏళ్లలో ప్రస్తుతం ఇస్తున్న 7శాతం, 12శాతంను 10శాతం, 15శాతంకు పెంచడంపై ఏదో ఒకటి మాత్రమే చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. పదవీవిరమణ చేసిన వారి బకాయిలపై సీఎస్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చర్చల్లో వెల్లడించారు. కారుణ్య నియామకాల వివరాలను జిల్లాల వారీగా తెప్పించుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారే తప్ప, ఎప్పటిలోపు అనే గడువు పెట్టలేదు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి కొంతమంది జాబితాను ఈ నెల చివరిలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story