AP Cabinet: ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రతిష్ఠాత్మక బీపీసీఎల్, టీసీఎస్ ప్రాజెక్టులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. ఇవి కార్యరూపం దాలిస్తే ఏపీ పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోనుంది. అనుబంధ పరిశ్రమల రాకతో పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీయనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదనల ప్రకారం.. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల అతి భారీ పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కానుంది. మొత్తం 9మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టులో టౌన్షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రో కెమికల్స్ యూనిట్స్, క్రూడాయిల్ టెర్మినల్, గ్రీన్హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులను నిర్మిస్తారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
అమరావతిలో గురువారం భేటీ అయిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 14 అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్.. రైతులకు, విద్యార్థులకు, మత్సకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం డబ్బులు ఇవ్వనుంది. రైతులకు రూ.20 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మత్య్సకారులకు హాలిడే సమయంలో రూ. 20 వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీలో డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం
విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ మెట్రోలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2017 మెట్రో పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లించి కలకత్తా మెట్రో పూర్తి చేసిందని.. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంతో చర్చించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కాగా 4 ఏళ్లలో లక్ష్యాలు పెట్టుకుని పని చెయాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com