KOMMINENI: భగ్గుమన్న మహిళలు.. సాక్షి ఆఫీసులకు తాళాలు

"అమరావతి వేశ్యల రాజధాని" అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంది. రోత చానల్ లైవ్ డిబేట్లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీవాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.“వేశ్యల రాజధాని” వ్యాఖ్యలు ఆందోళనలకు ఆజ్యం పోశాయి. ఈ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు.. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు బూతు పురాణం.. అమరావతి ప్రజలను, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి టీవీ యాజమాన్యంపై, డిబేట్లో పాల్గొన్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ను లేవనెత్తాయి. ఇప్పటికే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించగా, మహిళా కమిషన్ ఈ అంశాన్ని సీరియస్గా పరిగణిస్తోంది. అయితే… వైసీపీ... సాక్షి టీవీ ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఖండించినప్పటికీ, క్షమాపణ చెప్పడానికి ముందుకు రాలేదు. ఈ ఘటన వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగించింది.
కొమ్మినేని అరెస్ట్
అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్కు చెందిన కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ రావు, జర్నలిస్టు కృష్ణం రాజుపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానెల్లో జరిగిన డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణం రాజు.. అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.
జగన్, భారతీ క్షమాపణలు చెప్పాలి:షర్మిల
అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి ఛానెల్లో చర్చలు దారుణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతి మహిళలకు సాక్షి టీవీ ఛైర్పర్సన్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానికి వ్యతిరేకంగా సాక్షి ఛానల్లో మాట్లాడటం అవమానకరమన్నారు. మహిళలను అవమానించడంపై జగన్ క్షమాపణ కోరితే సంతోషిస్తానని తెలిపారు. సాక్షి పత్రిక, ఛానెల్ ప్రజాసమస్యల్ని విస్మరించి వైసీపీకి ప్రచారం చేస్తున్నాయని, ప్రజా సమస్యల్ని విస్మరించిన సాక్షి చరిత్రకెక్కిందంటూ మండిపడ్డారు.
అవమానిస్తారా..?
రాజకీయ నాయకుల ముసుగులో నడిపే మీడియా.. సమాజానికి చాలా ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. అమరావతి మహిళలను అవమానపరచారని మండిపడ్డారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నా చర్చ కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏం మాట్లాడినా చెల్లిపోతుందనుకుంటే కఠిన చర్యలు తప్పవని శైలజ హెచ్చరించారు.
అమరావతి రైతు సమన్వయ కమిటీ హెచ్చరిక
‘అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడించిన సాక్షి చానల్ను, మాట్లాడినవారిని రైతు జేఏసీ వదిలిపెట్టదు. తగిన శాస్తి చేశాకే వారిని చట్టానికి అప్పగిస్తాం. భారతీ రెడ్డిని విమర్శించిన చేబ్రోలు కిరణ్ను హుటాహుటిన అరెస్టు చేసిన ప్రభుత్వం, కొమ్మినేనిని, కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయలేకపోయిందో చెప్పాలి’ అంటూ రాజధాని అమరావతి రైతు సమన్వయ కమిటీ భగ్గుమంది. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్, సాక్షి చానెల్ను, వారిపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరుపై కమిటీ నేతలు విరుచుకుపడ్డారు. అమరావతిపై, మహిళలపై తప్పుడు ప్రచారాలకు దిగితే, ఎంతటివారికైనా బడిత పూజ తప్పదని తెగేసి చెప్పారు.
సాక్షి బోర్డును పీకేసిన మహిళలు
రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో సాక్షి కార్యాలయాన్ని మహిళలు ముట్టడించారు. సాక్షి కార్యాలయం నేమ్ బోర్డును ధ్వంసం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com