LOKESH: ధర్మమే గెలుస్తుంది: లోకేశ్‌

LOKESH: ధర్మమే గెలుస్తుంది: లోకేశ్‌
రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై కేసు... వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమా...

రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఇరికించారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు నేరం చేసినట్లూ నిరూపించే ఏ ఆధారం ఇప్పటి వరకు జగన్‌ ప్రభుత్వం చూపలేదన్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ధీమా వ్యక్తం చేశారు. జగన్ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టి వేధిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన నైపుణ్య శిక్షణ ప్రాజెక్ట్‌నే చంద్రబాబు ఏపీలో అమలు చేశారని...ఆయా రాష్ట్రల్లో కనిపించని తప్పులు జగన్‌ ప్రభుత్వానికే కనిపించాయా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఇబ్బంది పెట్టేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న లోకేశ్‌ అంతిమంగా ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రానున్న ఎన్నికల్లో తమను ఇబ్బంది పెట్టేందుకే జగన్ ఈవిధంగా చేశారని ఆయనపై 36 కేసులు ఉన్నాయని, తనలాగే అందరూ జైలుకు వెళ్లాలని కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. జగన్ క్విడ్‌ ప్రోకోకు పాల్పడినట్లు డాక్యుమెంట్ ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ నిధులు, సాక్షి పత్రిక, టీవీ, సిమెంట్ సంస్థ, విద్యుత్ ప్రాజెక్టులు సహా బెంగళూరులో వాణిజ్య సముదాయానికి మళ్లించినట్లు నిరూపితమైందన్నారు. చంద్రబాబు నిధులు మళ్లించినట్లయితే ఆధారాలతో చూపాలన్నారు. ఇదంతా నిందలు మోపడం తప్ప మరొకటి కాదని లోకేశ్ వెల్లడించారు. తెలుగుదేశం శ్రేణులు వైకాపా ప్రభుత్వంపై పోరాడి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారని చంద్రబాబు సీఎం కావడం ఖాయమని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.


నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి షెల్‌ సంస్థలకు నిధులు మళ్లించారంటూ 2021లో F.I.R. నమోదు చేసినా ఇప్పటి వరకు ఛార్జిషీట్ ఫైల్ చేయలేదని లోకేశ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి 36 మంది నిందితులను ఈడీ, ఐటీ అధికారులతో పాటు ఇతర విభాగాలకు చెందిన అధికారులు విచారించారని లోకేశ్ గుర్తుచేశారు. ఒకవేళ ఏమైనా తప్పు జరిగినట్లు తేలితే.. ఆయా దర్యాప్తుల్లో బయటపడేది కదా అన్నారు. మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదని.. అలాంటప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్ విభాగంలో అక్రమాలు జరిగినట్లు ..అందుకు చంద్రబాబే కారణమని వైకాపా ప్రభుత్వం అరెస్ట్‌లు చేయించడం దారుణమన్నారు. రాజకీయ కక్షతోనే ఏపీలో పాలన సాగుతోందన్నది వందశాతం నిజమన్నారు. ఏపీలో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేసిన సంస్థలే...ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధానంలో శిక్షణ ఇచ్చాయి. ఆయా రాష్ట్రాలు చెల్లించిన మొత్తం కన్నా...చంద్రబాబు ప్రభుత్వం తక్కువే చెల్లించింది. ఈ ప్రాజెక్ట్‌లో లేని అక్రమాలను వైకాపా ప్రభుత్వం ఎలా చూపగలదని లోకేశ్ ప్రశ్నించారు.

Tags

Next Story