TDP-BJP-JSP: చరిత్రలో నిలిచిపోయేలా కూటమి బహిరంగ సభ

TDP-BJP-JSP: చరిత్రలో నిలిచిపోయేలా కూటమి బహిరంగ సభ
విస్తృత ఏర్పాట్లు చేస్తోన్న మూడు పార్టీలు.. దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్న నారా లోకేశ్‌...

ఈ నెల 17 న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరుకానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్వయంగా సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కూటమి తొలి బహిరంగ సభ నిర్వహణపై మూడు పార్టీల నాయకులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో దాదాపు దశాబ్దం తర్వాత 2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖచిత్రం మళ్లీ ఆవిష్కృతం కానుంది. చిలకలూరిపేటలో నిర్వహించే సభలో ప్రధాని మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... ఒకే వేదికను పంచుకోనున్నారు.


ఏపీ ప్రగతి, అభివృద్ధి, ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయనే సందేశాన్ని ఈ సభ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తు ప్రకటన తర్వాత మూడు పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ కావటంతో అందరూ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బొప్పూడి సమీపంలో ఏర్పాట్లు సైతం చకాచకా సాగుతున్నాయి. ఇప్పటికే బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి మూడు పార్టీల నేతలతో 13 కమిటీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసంలో నారా లోకేశ్‌ సమక్షంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షకు 3 పార్టీల కమిటీ సభ్యులు హాజరయ్యారు. కూటమి తొలిసభను సమన్వయంతో విజయవంతం చేయాలని లోకేష్ నేతలకు సూచించారు. ఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశం చేశారు.


బుధవారం ఉదయం 9 గంటల 32 నిమిషాలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయాలని సమీక్షలో నిర్ణయించారు. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సమాచారం పంపింది. 17న సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ సభ వద్దకు చేరుకుంటారు. ప్రధాని రాకతో సభ వద్ద మొత్తం మూడు హెలిప్యాడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక హెలిప్యాడ్ నిర్మాణం పూర్తయింది. మిగతా పనులు ఊపందుకున్నాయి. ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం లోకేష్ సభా ప్రాంతానికి రానున్నారు. ఇప్పటికే సభ నిర్వహణకు సంబంధించి నేతలు వారికి అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. ఈ సభకు బస్సులు కేటాయించేందుకు ఆర్టీసీ అంగీకరించడంతో ఆ సంస్థతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు తీసుకుంటామని నేతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story