MOTHKUPALLY: జగన్‌ ఓ అసమర్థుడు

MOTHKUPALLY: జగన్‌ ఓ అసమర్థుడు
జగన్‌ కళ్లకు అహంకార పొర కమ్మిందన్న మోత్కుపల్లి నర్సింహులు... ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఒకరోజు దీక్ష

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ ఓ నియంతలా మారారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటుంబాన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. చంద్రబాబు లేకపోతే.. తనకు ఎదురుండదని జగన్ భావిస్తున్నారన్నారు. బాబు అరెస్టుకు నిరసనగా మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్ లోని NTR ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించిన తర్వాత ప్రారంభించిన ఈ దీక్ష.... సాయంత్రం 5గంటల దీక్ష చేశారు.


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంపై 2021లో కేసు నమోదైతే ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని నాలుగేళ్ల తర్వాత అరెస్ట్‌ చేయించిన ఘనత ఏపీ సీఎం జగదేనని ఎద్దేవా చేశారు. జగన్‌పై మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ వచ్చిన అధికారాన్ని కాపాడుకోలేని ఓ అసమర్థుడని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా నియంత అని జగన్‌ పేరు తెచ్చుకున్నారని, చంద్రబాబును అరెస్ట్ చేసి ఏం ఆనందం పొందారో అర్థం కావడం లేదని మోత్కుప్లలి మండిపడ్డారు.


నారా భువనేశ్వరి ఏడుపు జగన్‌కు తగులుతుందని మోత్కుపల్లి అన్నారు. ఎదుటి వారిని ఇబ్బంది పెడితే జగన్‌కే నష్టమన్న ఆయన.. రానున్న రోజుల్లో వైసీపీకి 4 సీట్లు కూడా రావన్నారు. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో కూడా భాగం ఇవ్వకుండా బయటకు గెంటేశారన్న మోత్కుపల్లి... జగన్‌ గెలుపు పాపంలో తనకు భాగస్వామ్యం ఉన్నందుకు బాధపడుతున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story