AP: ఎక్కడికక్కడ నిలిచిపోయిన నాడు-నేడు పనులు

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన 'నాడు-నేడు' పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐదారు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామాగ్రి సరఫరాను నిలిపివేశాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈలోపు పనులు పూర్తికాకపోతే బడులకు వచ్చే పిల్లలకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 600కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని స్కూళ్లను నిధుల సమస్య వెంటాడుతోంది. భవన నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోవటమే కాక అనేక పాఠశాలల్లో విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయలేదు. బాత్రూముల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయాయి. ఇసుక ఆర్డర్ పెడితే ఎప్పుడొస్తుందో తెలియడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. సిమెంటు కంపెనీలకు బకాయిలు పేరుకుపోవడంతో సరఫరాను నిలిపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పనులు త్వరగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు.
పరీక్షలు, ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉన్న ఉపాధ్యాయులపై... నాడు-నేడు పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో కిటికీలు, తలుపులు, ఆర్వో పాంట్లు బిగించాల్సి ఉంది. వాటిని అమర్చడానికి ప్రభుత్వం టెక్నీషియన్లను పంపడం లేదు. ఇన్ని సమస్యల మధ్య అసంపూర్తి నిర్మాణాలు నెలాఖరిలోపు ఎలా పూర్తవుతాయని ప్రధానోపాధ్యాయిలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురంలోని పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ పాఠశాలలో నాడు-నేడు కింద 9 గదుల నిర్మాణం చేపట్టారు. 3 గదులకు పైకప్పు వేయడానికి నిధులు లేక పనులు నిలిపేశారు. పాఠశాల గదుల్లో నిర్మాణ సామాగ్రి ఇటుకలు, కంకర కుప్పలుగా పోశారు. ఉరవకొండ మండలం మోపిడిలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com