Nara Lokesh : బాధిత కుటుంబానికి 21 రోజుల్లో న్యాయం చేయాలి : లోకేష్

Nara Lokesh : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి రణరంగమైంది. హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లారు. అయితే లోకేష్ సహా టీడీపీ శ్రేణులను వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఒక్కసారిగా రాళ్లు రువ్వారు.. చేతికందిన రాళ్లతో వైసీపీ కార్యకర్తలు విసిరిన రాళ్లు పోలీసులతోపాటు టీడీపీ శ్రేణులకూ తగిలాయి.. ఓ రాయి లోకేష్ వరకు వెళ్లింది.. లోకేష్పై రాళ్లు దాడి, ప్రెస్మీట్ను అడ్డుకోవడం, వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదంతో తుమ్మపూడిలో హైటెన్షన్ నెలకొంది.
తుమ్మపూడిలో భారీగా మోహరించిన వైసీపీ శ్రేణులు.. నారా లోకేష్ తిరుగు ప్రయాణంలోనూ మరోసారి చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. లోకేష్ కాన్వాయ్ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకుముందు నాటకీయ పరిణామాల మధ్య తిరుపతమ్మ మృతదేహం తరలించేందుకు పోలీసులు యత్నించారు. లోకేష్ వస్తుండటంతో ముందుస్తుగా డెడ్బాడీని తరలిస్తుండగా.. అంబులెన్స్ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు.
జగన్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో మహిళకు రక్షణ లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది మందిని కంట్రోల్ చేయలేని పోలీసుల్ని ఏమనాలని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడేందుకు వెళ్తే తమపైనే కేసులు పెడతారా అంటూ నిలదీశారు. ఏపీలో పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీపై ఎవరి ఒత్తిడి ఉంది..? ఎస్పీతో ఎవరెవరు మాట్లాడారో కాల్ రికార్డులు బయటపెట్టాలన్నారు. బాధిత కుటుంబానికి 21 రోజుల్లో న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com