AP: ఆంధ్రప్రదేశ్‌లో పడకేసిన పర్యాటకం

AP: ఆంధ్రప్రదేశ్‌లో పడకేసిన పర్యాటకం
ప్రారంభంకాని ప్రాజెక్టులు... వెలవెలబోతున్న పర్యాటక శాఖ

మాయ మాటలతో మేడలు కట్టే వైసీసీ ప్రభుత్వం పర్యాటక రంగంలో పెట్టుబడులపై ఏకంగా అబద్ధాల రిసార్టులు కట్టేసింది. విశాఖ పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి వేలకోట్ల పెట్టుబడులంటూ ఊదరగొట్టగా అందులో కనీసం 20శాతం కూడా అమల్లోకి రాలేదు. ఏపీ అంటనే పర్యాటక సంస్థలు వెనుకంజ వేస్తున్నాయి. టూరిజం రిసార్టుల ముసుగులో రుషికొండపై రాజభవనం కట్టుకోవడం తప్ప జగన్‌ ఒరగబెట్టిందేమీలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్‌ జమానాలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకాభివృద్ధి పడకేసింది. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. గతేడాది విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడుదారుల సదస్సులో.. 17 వేల 127 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాని జగన్‌ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. ఏకంగా 39 వేల 170 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశలు రేపింది. కానీ ఆ ఒప్పందాల్లో కేవలం 3వేల94 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే సాకారమయ్యాయి. మొత్తం 20 ప్రాజెక్టులు చేపట్టగా కేవలం మూడే ప్రారంభమయ్యాయి.


విజయవాడలో ఒక హోటల్, బాపట్లలో బీచ్‌ రిసార్టు, సత్యసాయి జిల్లాలో వెల్‌నెస్‌ సెంటర్‌ మినహా మిగిలిన 17 ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లోనే ఉన్నాయి. మిగిలిన సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా రెండు ఉన్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. పెట్టుబడులపై ప్రభుత్వ రాయితీలు కాగితాలకే పరిమితమవడంతో ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు! పెట్టుబడులు పెట్టి హోటళ్లు ప్రారంభించే వారికి APGSTఐదేళ్ల వరకు మినహాయింపు, బార్ల ఫీజుల్లో రాయితీ వంటివి సరిగా అమలుకావడం లేదు. హోటళ్ల నిర్వాహకులనుంచి... ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ ఏడాది జనవరి 29 నుంచి 31 వరకూ 3 రోజులపాటు విశాఖలో నిర్వహించిన దక్షిణ భారత హోటళ్ల అసోసియేషన్‌ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాతినిధ్యమే లేదు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల పర్యాటకశాఖల నుంచి ఆయా ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరైనా ఏపీ నుంచి ఎవరూ పాల్గొనలేదు.

పెట్టుబడుదారులకు ప్రోత్సాహకాలిచ్చి ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చుతామని ఫోజులు కొట్టే జగన్‌ సుదూరాల నుంచి విశాఖ నగర సందర్శనకు వచ్చే పర్యాటకులకు సౌకర్యంగా ఉండే రుషికొండపై రిసార్టు కూల్చేశారు. 450 కోట్ల రూపాయలతో రాజభవనం నిర్మించుకున్నారు. పాడైన రిసార్టులు, హోటళ్ల అధునికీకరణ కోసం ప్రభుత్వం నుంచి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు ఒక్క రూపాయైనా కేటాయించలేదు. బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలని అనుమతులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఆస్తులు తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు ఏడాదిన్నరగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. చాలారోజుల తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చినా రుణ మొత్తం ఇంకా విడుదల చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story