JAGAN: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రాజెక్టులపై ప్రేమ

JAGAN: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రాజెక్టులపై ప్రేమ
ముఖ్యమంత్రి జగన్‌ తీరుపై మండిపడుతున్న ప్రతిపక్షాలు...ప్రాజెక్టు పూర్తికాకుండానే పైలాన్‌ ఆవిష్కరణపై విస్మయం

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఐదేళ్ల పాటు పబ్బం గడిపిన ముఖ్యమంత్రి జగన్ పాలన ముగింపు దశకు వచ్చేసరికి ప్రాజెక్టులపై ప్రేమ ఒలకబోస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తిచేసి నీళ్లు ఇస్తామని చెప్పిన జగన్‌ ఇప్పుడు ప్రాజెక్టు పూర్తికాకుండానే పైలాన్‌ను ఆవిష్కరించడం ఏంటని రాజకీయపక్షాలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా, ఫీడర్‌ కాలువ లైనింగ్‌ పనులు పూర్తిచేయకుండానే జాతికి అంకితమివ్వడం ఏంటని నిలదీస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయడమంటే. నిర్దేశించిన ఆయకట్టుకు పూర్తిగా లేదా కొంతవరకైనా నీళ్లివ్వాలి. తాగునీరు అందించాలి. ఈమేరకు నిర్మాణ పనులు పూర్తయ్యాకే ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. జగన్‌ మాత్రం తన అయిదేళ్ల పాలనాకాలంలో ఈ పని పూర్తి చేయలేకపోయారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, కరవు ప్రాంతానికి నీరందిస్తామని గత ఎన్నికల ముందు ఊరూరా తిరిగి మరీ చెప్పిన జగన్‌ ఇప్పుడు మాట నిలబెట్టులేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోయారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూలు వస్తున్నందున కేవలం రెండు టన్నెళ్లను మాత్రమే జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు అందించాలంటే ఇంకా చాలా పనులు పూర్తి చేయాలి. ఇందుకు వేల కోట్ల నిధులు కావాలి. ఒక టన్నెల్‌ సింహభాగం ఎప్పుడో టన్నెల్‌ బోరింగు మిషన్‌తో పూర్తి చేశారు. రెండో టన్నెల్‌ను హడావుడిగా మనుషుల సాయంతో, కొంతభాగం యంత్రాలతో తవ్వించారు. ఇంకా లైనింగు పనులు పూర్తి చేయలేదు. రెండు టన్నెళ్లు తవ్వి ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేసినట్లు హడావుడి చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు శ్రీశైలంలో నిండుగా నీళ్లున్నా కూడా ఆయకట్టుకు అందించేలా పనులు పూర్తి చేయలేదు. టన్నెళ్లు తవ్వడంతో పాటు నల్లమలసాగర్‌లో నీటిని నిలబెట్టేందుకు వీలుగా పునరావాసం పూర్తి చేసి, అక్కడి నుంచి జలాలను ఆయకట్టుకు తరలించేలా పనులు చేసి ఉంటే కరవు ప్రాంత ప్రజలు సంతోషపడేవారు. కేవలం కొంత పని పూర్తి చేసి వెలిగొండ పూర్తయిందన్నట్లుగా జగన్‌ ప్రభుత్వం హడావుడి చేస్తుందని విపక్షాలు తప్పుబడుతున్నాయి.

శ్రీశైలం వరద జలాలను కరవు నేలకు అందించి పచ్చని సీమగా మార్చేందుకు ఉద్దేశించింది వెలిగొండ ప్రాజెక్టు. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి కడప జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలకు నీరందించడం, లక్షలమంది ప్రజలకు తాగునీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. టన్నెళ్ల తవ్వకానికి, పునరావాసానికి, ఆ పైన జలాశయాల నిర్మాణానికి, కాలువల తవ్వకానికి సమాంతరంగా జగన్‌ సర్కార్‌ సరిపడా నిధులిచ్చి.. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసి ఉంటే ఈ లక్ష్యసాధనకు అయిదేళ్ల సమయం సరిపోయేది. అయితే సరైన ప్రణాళిక లేక, చాలినన్ని నిధులివ్వక జగన్‌ సర్కారు ప్రాజెక్టును ముందుకు కదపలేకపోయింది. అయిదేళ్లు పూర్తయిపోయి మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో కేవలం టన్నెళ్ల తవ్వకంతోనే ప్రాజెక్టు పూర్తయిపోయినట్లు హంగామా చేసింది.

Tags

Read MoreRead Less
Next Story