Pawan Kalyan: పవన్ కల్యాణ్ పేరుతో జిల్లా అధికారి దందా

కాకినాడ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రవీంధ్రనాథ్ రెడ్డి పవన్ కల్యాణ్ పేరు చెప్పుకుని దందాలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పవన్కు తాను అత్యంత సన్నిహితుడినని, ఆయన సిఫారసుతోనే వచ్చానని మైనింగ్, అటవీశాఖ అధికారులు సహా పలువురు వ్యాపారుల్ని బెదిరిస్తున్నారనే వార్తలు సంచలనం రేపాయి. రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో అంతర్గతంగా విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకున్నారని టాక్.
కాకినాడ డీఎఫ్వో రవీంద్రనాథ్రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. తన పేరు, కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాకినాడ అటవీశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రవీంద్రనాథ్రెడ్డి.. మైనింగ్ వాహనాల విషయంలో కొన్ని రకాల ఆంక్షలు విధించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు ఆయన పేషీలోని ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వారి పేర్లు చెప్పి.. మైనింగ్, అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు అభియోగాలున్నాయి. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ విచారణకు ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com