AP : మోడీ ముందు రెచ్చిపోయిన పవన్ కల్యాణ్

AP : మోడీ ముందు రెచ్చిపోయిన పవన్ కల్యాణ్

చిలకలూరిపేట మోడీ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఆదివారం విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి జరిగిన ఎన్డీయే బహిరంగ సభను ఉద్దేశించి పవన్‌ ప్రసంగించారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయి, అభివృద్ధి లేమితో సతమతమవుతున్న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక పెద్ద ఊరటనిచ్చిందన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి రావడం పట్ల సంతోషంగా ఉన్నారని అన్నారు. 2014లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తమ కూటమి ఏర్పడిందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, బాలాజీ ఆశీస్సులతో అప్పుడు పొత్తు ప్రకటించామని, ఇప్పుడు మళ్లీ 2024లో దుర్గమ్మ తల్లి వారి ఆశీస్సులతో మూడు పార్టీలు కలిశాయని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వేధింపులు భరించలేక ఇక్కడి నుంచి పారిపోతున్నాయన్నారు. 2014లో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి శాతం 10.4 శాతం ఉండగా ఇప్పుడు (మైనస్) మూడు శాతానికి చేరుకుందని చెప్పారు. ''ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించబోతున్న మోదీకి నా హృదయపూర్వక స్వాగతం. ఆయన ఇక్కడికి రావడంతో అమరావతి మళ్లీ వెలుగొందుతుందన్న నమ్మకం రాష్ట్ర ప్రజల్లో చిగురించింది'' అని అన్నారు. జగన్ తన డబ్బుతో చేయాలనుకుంటున్నది చేయలేరని.. ప్రధాని మోడీ ఇక్కడ 'రామరాజ్యాన్ని' స్థాపించబోతున్నారని జనసేన అధినేత అన్నారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైందని, ఎన్డీయేకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story