"హలో ఏపీ, బై...బై... వైసీపీ" అంటూ గర్జించిన పవన్

"హలో ఏపీ, బై...బై... వైసీపీ" అంటూ నినదించారు జనసేనాని పవన్ కళ్యాణ్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జగన్ ప్రభుత్వం మారాలన్నారు. అరాచకం ఆగాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాలని అందుకు ప్రజలందరూ నడుం బిగించాలన్నారు. దళితుల అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పే జగన్ రెడ్డి.. 23 దళిత పథకాలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర యువత, మహిళలు మారుతున్నారని తొందరలోనే జగన్ ను ఇంటికి సాగనంపుతారని ధీమా వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కన్నా జగన్ గొప్పవాడా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ మారాలంటే అమలాపురం నుంచే శ్రీకారం చుట్టాలని పవన్ అన్నారు. "హలో ఏపీ బైబై వైసీపీ" అనే నినాదం ప్రజల కఠంలో మారుమ్రోగాలని తెలిపారు. ఈ వాక్కు రాష్ట్రం నలుమూలలా చైతన్యం తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే... కోనసీమకు రైల్వే లైన్ ను తీసుకువస్తానని పవన్ హామీ ఇచ్చారు. పరిశ్రమలనుంచి రావాల్సిన సీఎస్ ఆర్ నిధులను వైసీపీ కాజేస్తుందని ఆరోపించారు.
జనసేన అధికారంలోకి వచ్చాక 70శాతం ఉద్యోగాలు కోనసీమ యువతకు కల్పిస్తానని అన్నారు. "జనసేనకు అధికారం ఇవ్వండి.. పార్లమెంట్ లో గొంతు వినిపించేలా చేయండి" అని కోరారు. విద్య వైద్యంపై దృష్టి పెట్టే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అది జనసేనకు మాత్రమే సాధ్యమని అన్నారు. ప్రతీ కుటుంబానికి రూ.25లక్షల ఇన్సురెన్స్ ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ కొన్ని చికిత్సలకు పనికి రావడంలేదన్నారు.
ప్రజలందరూ తనకు సమానమేనన్నారు పవన్. కోనసీమ నుంచి కడప వరకు తాను అందరికీ అండగా ఉంటానని తెలిపారు. జగన్ మాట్లాడితే క్లాస్ వార్, క్లాస్ వార్ అంటాడని చేసేవన్నీ దోపిడీ పనులేనని అన్నారు. క్లాస్ వార్ అంటే డబ్బున్న వాళ్లు పేదలను దోచుకోవడం అని ఆ పనే జగన్ చేస్తున్నాడని ఆరోపించారు. మాటలు చెగువేరా, చేతలు రాబిన్ హుడ్ లా చేస్తానని చెప్పి జగనే ఓ పెద్ద దోపిడీదారు అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు జనసేనకు మాత్రమే ఉందని అన్నారు పవన్.
నువ్వొక పుచ్చలపల్లి సుందరయ్యవి కాదు, సీతారామయ్యవి కాదు..నువ్వు ఒక దోపిడీ దారుడివి అని జగన్ ను ఉద్దేశించి విరుచుకుపడ్డారు పవన్. పోలీసులు, ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్స్ అమౌంట్ 13 వందల కోట్లు దోచుకున్నది సీఎం జగన్ అని ఆయన ఆరోపించారు. అభివృద్ధి జరగాలంటే...ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే... వైసీపీ ప్రభుత్వం పోవాలన్నారు.... జనం బాగుండాలంటే జగన్ ఇంటికి పోవాలి. అందుకే ఏపీ ప్రజలందరూ హలో ఏపీ... బై...బై వైసీపీ నినాదాన్ని కణకణం గుర్తుంచుకుని జగన్ వ్యతిరేకంగా జనసేనకు అనుకూలంగా ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com