MODI: యోగాంధ్రపై మోదీ ప్రశంసల జల్లు

MODI: యోగాంధ్రపై మోదీ ప్రశంసల జల్లు
X
విజయవంతం చేయాలని ప్రధాని మోదీ పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో యోగా దినోత్సవం పట్ల ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. యోగాంధ్ర 2025 పేరిట యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. జూన్‌ 21న ఏపీలో యోగా దినోత్సవం జరుపుకొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. అందరూ యోగా దినోత్సవంలో పాల్గొనాలని, యోగాను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

యోగాంధ్రలో భాగంగా చిత్తూరు సమీపంలోని పులిగుండు ట్విన్‌హిల్స్‌లో దాదాపు 2వేల మందికి పైగా ఔత్సాహికులు యోగాసనాలు వేస్తున్న ఫొటోలను కేంద్ర ఆయుష్‌ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేయగా.. ఆ ట్వీట్‌ను ప్రధాని రీట్వీట్‌ చేశారు. జీవన శైలిలో భాగమయ్యేలా యోగాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర-2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. మే 21 నుంచి జూన్‌ 21 వరకు కూటమి ప్రభుత్వం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో యోగాపై అవగాహన కల్పిస్తోంది. కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నది సంకల్పంగా పెట్టుకోగా.. 10 లక్షల మందికిపైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకుంది.


Tags

Next Story