Pinnelli : పిన్నెల్లి అరెస్ట్కు రంగం సిద్ధం..

మాచర్ల మాజీ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియడంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం E.V.Mల ధ్వంసం కేసుతో సహా మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు పిన్నెల్లి... న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పోలింగ్ ఘర్షణలు, దాడుల కేసుల్లో అరెస్టుకు భయపడిన పిన్నెల్లి సోదరులు.... గతంలో పోలీసులు కళ్లు గప్పి పారిపోయిన నేపథ్యంలో... ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్పీ ఆదేశాలతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో పహారా కాస్తున్నారు.
దాదాపు 15 ఏళ్లుగా అవినీతి, అక్రమాలు, అరాచకాలకు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చిన మాచర్చ మారీచుడు మాజీ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇవాళ అరెస్టు చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేట్ లో E.V.Mధ్వంసంతో పాటు, మూడు హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు పిన్నెల్లి సోదరులు అనేక అరాచకాలకు, దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో... సిట్ విచారణలో వెలుగుచూడటం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పోలింగ్ అనంతరం కూడా నియోజకవర్గంలో పిన్నెల్లి, ఆయన అనుచరులు తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్... పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ పొందారు. 6వ తేదీ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై పిన్నెల్లి బాధితుడు నంబూరు శేషగిరిరావు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... హైకోర్టు తీర్పుతో విబేధిస్తూ పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6న హైకోర్టు... పిన్నెల్లి కేసును విచారించి, పరిష్కరించాలని స్పష్టం చేసింది.
హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో పిన్నెల్లి అరెస్టు మీద రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం పిన్నెల్లి నరసరావుపేటలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉండటంతో... ఆ ఇంటి బయట పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. మఫ్టీలో పోలీసులు పహారా కాస్తున్నారు. మరోసారి పిన్నెల్లి తప్పించుకోకుండా ఉండేందుకు ఇంటి వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్, ఆ తరువాత జరిగిన ఘటనలతో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా పల్నాడు ప్రాంతమంతా హై అలెర్ట్ కొనసాగుతోంది. వ్యాపార దుకాణాలను మూసివేస్తున్నారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఇక ఖాయమని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com