Posani : పోసానికి జైల్లో అస్వస్థత.. సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి తీర్పునిచ్చారు. కోడూరు సివిల్ జడ్జి కోర్టులో దాఖలైన పోసాని బెయిల్ పిటిషన్ రద్దయింది. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు పోసానిని పోలీసు అధికారులు తీసుకువచ్చారు. ఏడు గంటలకు పైగా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో విచారణ సాగింది. రాత్రి 9.00 గంటలకు పోసాని కృష్ణమురళి పోలీసు అధికారులు కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరు పరిచారు. పోసాని తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేసి తన వాదనలు వినిపించారు. రాత్రి సుమారు మూడున్నర గంటల వరకు జరిగిన విచారణ అనంతరం కృష్ణ మురళికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఆదేశాలు వెలువడడంతో ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బస ఏర్పాట్లు చేశారు. జైల్లో పోసాని అనారోగ్యం పాలైనట్టు సమాచారం. ఆయన్ను వెంటనే సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com