Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల కొండ.. దర్శనానికి 24 గంటలు వేచి ఉండాల్సిందే..

Tirumala: తిరుమల కొండ కిటకిట లాడుతోంది. టోకెన్లు లేకుండానే కొండమీదకు అనుమతిస్తుండడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరుమలలోని 30 కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో బయట కూడా భక్తులు క్యూ కట్టారు. స్వామివారి దర్శనానికి కనీసం 24 గంటల పైనే పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.
సర్వదర్శనానికి వచ్చే భక్తులు.. క్యూ లైన్లో కనీసం 20 నుంచి 30 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని దానికి తగ్గట్టుగానే తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తిరుమలలో సౌకర్యాలు లేక భక్తులు నానా కష్టాలు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా రూములు లేక భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమలలోని 2వేలకు పైగా గదులకు మరమ్మతులు చేయిస్తోంది టీటీడీ.
రూములు ఖాళీ లేకపోవడంతో గదుల కేటాయింపు ఆఫీసును మూసేశారు. దీంతో రూములు దొరక్క.. ఫుట్పాత్లు, రోడ్లు, పార్కుల్లోనే సేదదీరుతున్నారు భక్తులు. తలనీలాలు సమర్పించేందుకు కూడా భక్తులు అవస్థలు పడాల్సి వస్తోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం, అందరినీ ఒకేసారి కొండమీదకు వదలడంతో తలనీలాలు సమర్పించే ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తానికి స్వామివారి దర్శనానికి, గదులకు, తలనీలాల సమర్పణకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com