Sankranthi 2022 : తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
Sankranthi 2022 : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మూడ్రోజుల సంక్రాంతిని తెలుగు ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. తొలి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇవాళ పెద్ద పండుగ సంక్రాంతిని జరుపుకుంటున్నారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంతో ఇవాల్టి నుంచి ఉత్తరాయణ ప్రారంభమవుతోంది. ఇది ప్రధానంగా రైతుల పండుగ కావడంతో.. పల్లెటూళ్లన్ని... ఇంటి ముందు రంగవల్లులు, పతంగుల ఆటలు, కోడి పందాలతో సందడిగా మారాయి.
ఉత్తరాయణ దేవతలకు ప్రీతికరం. నువ్వుల ధానం, నల్లనువ్వులతో హోమం చేస్తే.. శని ధోషాలు, అకాల మృత్యదోషం నివారణ అవుతుందని నమ్మకం. గుమ్మడిపండును కూడా ధానం ఇస్తారు. మకర సంక్రాంతి రోజైన ఇవాళ... పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృ తర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. కొత్త పంట ధాన్యాన్ని వండి నైవేద్యంగా పితృదేవతలకు పెడతారు.
సంక్రాంతి ప్రధానంగా రైతుల పండుగ కావడంతో.. పల్లెటూరులు సందడిగా మారాయి. పిల్లలు పెద్దలు... కొత్తబట్టలతో ఆకట్టుకుంటున్నారు. ఇక రకరకాల నోరూరించే పిండివంటలు సరేసరి. ముంగిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో మురిసిపోతున్నాయి. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, గాలిపటాల ఎగరేస్తూ పిల్లల కేరింతలు, కోళ్ల, ఎడ్ల పందాలతో ఊరూవాడా సంబరాలు మిన్నంటుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com