ఏపీ పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్‌ చేసిన SEC

ఏపీ పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్‌ చేసిన SEC
సుప్రీం తాజా తీర్పుతో ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ స్వల్పంగా మారింది.

ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ సర్కార్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. తీర్పు సంద్భంగా ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రభుత్వం అంత ఇగో ఉండడం మంచిది కాదని.. ఎన్నికలకు సహకరించాల్సిందే అని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది.

ఎన్నికల కమిషన్‌ విధుల్లో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, రాజ్యంగ సంస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అని ప్రశ్నించింది. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని పేర్కొంది. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని కోరిన విషయాన్ని జస్టిస్ కౌల్ ప్రస్తావించారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదించడం ఎంత మాత్రం సహించబోమని సుప్రీం హెచ్చరించింది.

సుప్రీం తాజా తీర్పుతో ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ స్వల్పంగా మారింది. పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయింది. దీంతో మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 21న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు విడతలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 9న, రెండో విడత ఫిబ్రవరి 13న, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story