వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు : చంద్రబాబు
Nara chandrababu Naidu (File Photo)
తిరుపతిలో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలో వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కేంద్ర బలగాల సాయంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బస్సుల్లో వేల మంది దొంగ ఓటర్లను తరలిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో వేల మంది ఉంటే పోలీసులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ నేతలను అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతురులైన మంత్రులు తిరుపతిలో ఉంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఊడిగం చేస్తున్నారా అని మండిపడ్డారు.
మంత్రి పెద్దిరెడ్డికి తిరుపతిలో ఏం పని.. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని పార్టీలు ఓ వైపు.. వైపీపీ ఓ వైపు ఉన్నాయని విమర్శించారు. ఎన్నికల కమిషన్ నియమించిన మైక్రో అబ్జర్వర్లు ఏం అయ్యారని ప్రశ్నించారు. ఉప ఎన్నికను పూర్తిగా రద్దు చేయాలి.. కేంద్ర బలగాలు, సిబ్బందితో ఎన్నికలు నిర్వహించాలని బాబు డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com