TDP: టీడీపీ ఒక సాంఘిక విప్లవం

TDP: టీడీపీ ఒక సాంఘిక విప్లవం
X
నేటితో 43వ వసంతంలోకి అడుగుపెట్టనున్న టీడీపీ... తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఊపిరిపోసిన పార్టీ

టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. నేటితో పార్టీ 43వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. 1982 మార్చి 29న మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దివంగత ఎన్టీఆర్.. భారీ సభ జరిపి 'తెలుగుదేశం' పార్టీని అధికారికంగా ప్రకటించారు. ‘నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం’ అంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరి పోశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అంటే 1983 జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరూ చెరపలేని రికార్డును సృష్టించింది. ఎన్టీఆర్‌ నాయకత్వంలో టీడీపీ 294 సీట్లలో 202 గెలుచుకుంది. ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలగించిన ముఖ్యమంత్రి తిరిగి సీఎం కావడం ఎన్టీఆర్‌ ఒక్కరికే సాధ్యమైంది. 1984 ఆగస్టు సంక్షోభంలో పదవిని కోల్పోయిన ఆయన.. తిరిగి నెలరోజులకే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

ఓ సాంఘిక విప్లవం

నిజాయతీ, నిర్భీతి, నిక్కచ్చితనం కలబోసిన మహా వ్యక్తి ఎన్టీఆర్. టీడీపీని కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సాంఘిక విప్లవంగా మార్చేశారు. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, పేదవాడికి రెండు రూపాయలకే కిలో బియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌, పేదవాడికి పక్కా ఇల్లు... ఇలా ఎన్నో పథకాలతో దేశంలోనే ప్రజలకు సంక్షేమ పాలనను అందించిన మొదటి పార్టీగా టీడీపీ ప్రజల గుండెల్లో నిలిచింది.

టీడీపీ ఆవిర్భావ సభకు సీఎం

టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నేడు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ జెండా ఎగురవేయనున్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించనున్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.

ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ గ్రామ, పట్టణ వార్డులలో, మండలాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున శనివారం కోరారుప్రతి గ్రామంలో జెండా వందనం చెయ్యాలని, అదేవిదంగా సీనియర్ కార్యకర్తలకు సన్మానం చెయ్యాలని తెలిపారు.

Tags

Next Story