TDP: "కళ్లు తెరిపిద్దాం" నిరసనకు విశేష స్పందన

TDP: కళ్లు తెరిపిద్దాం నిరసనకు విశేష స్పందన
నిజం గెలవాలన్న నినాదాలతో మార్మోగిన తెలుగు రాష్ట్రాలు... కళ్లకు గంతలు కట్టుకుని నిరసన...

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు చేపట్టిన కళ్లు తెరిపిద్దాం కార్యక్రమానికి తెలుగురాష్ట్రాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఎక్కడికక్కడే తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నిజం గెలవాల అన్న నినాదాలతో తెలుగు రాష్ట్రాలు మార్మోగాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగనాసుర పాలన పోవాలని చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు. జగనాసురుడి కళ్లు తెరిపిద్దాం పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు హైదరాబాద్‌లోని తమ నివాసంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఏపీలో గుడ్డిగా నియంత పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి కళ్లు తెరిపిద్దామంటూ కృష్ణాజిల్లా అవనిగడ్డ, నాగాయలంక, మొవ్వ, గన్నవరంలో నిరసనలు తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కండ్రిగ, ప్రసాదంపాడులో తెలుగు మహిళలు, తెలుగు యువత నాయకులు నల్లరిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, చందర్లపాడులో నూ నిరసనలు కొనసాగాయి.


టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద నిరనస కార్యక్రమంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ ప్రభుత్వం ఆయన బయటికి రాకుండా కుట్రలు చేస్తోందని నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి, రాజధానిలోని తుళ్లూరు, దొండపాడు, వెంకటపాలెం, మందడం, పెనుమాకలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.


వెంకటపాలెంలో మానవహారం నిర్వహించారు. పల్నాడు జిల్లా పెట్లూరివారిపాలెంలో నిరసన ప్రదర్శన చేశారు. గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంతో పాటు చీరాల, అద్దంకి, దర్శిలో నిరసనలు కొనసాగాయి. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, కందుకూరు, కావలిలో ర్యాలీలు నిర్వహించారు.


ఏలూరు జిల్లా దెందులూరులో, తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, రాజమండ్రిలో తెలుగుదేశం కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో చంద్రబాబుకు తోడుగా మేము అంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ముమ్మిడివరంలో ఆందోళనలు నిర్వహించారు. అనకాపల్లిలో టీడీపీ కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలోని ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లా ధర్మవరం బీ గ్రామంలో చంద్రబాబు, ఎన్టీఆర్‌ అభిమానులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు

Tags

Next Story