అనంతపురం జిల్లాలో తెలుగు మహిళా అధ్యక్షురాలు ప్రియాంక ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లాలో తెలుగు మహిళా అధ్యక్షురాలు ప్రియాంక ఆత్మహత్యాయత్నం
TDP Mahila : టీడీపీ నేతలపై పోలీసులు పగబట్టారంటూ ఆరోపిస్తున్నారు అనంతపురం టీడీపీ లీడర్లు. నేతలను వెంటాడి మరీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TDP Mahila : టీడీపీ నేతలపై పోలీసులు పగబట్టారంటూ ఆరోపిస్తున్నారు అనంతపురం టీడీపీ లీడర్లు. నేతలను వెంటాడి మరీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీపై పల్లెత్తుమాట అనడం ఆలస్యం.. టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపైకి వచ్చేస్తున్నారంటూ బాధితులు మండిపడుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక అనంతపురంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు వాల్మీకి ప్రియాంక ఆత్మహత్యాయత్నం చేయడం టీడీపీ శ్రేణులకు మరింత ఆగ్రహం తెప్పించింది.

జగన్‌ సర్కార్‌తో పాటు వైసీపీ లీడర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం నాలుగవ పట్టణ పోలీసులు ప్రియాంక, ఇతర మహిళా నేతలపై కేసు నమోదు చేశారు. ఉదయం నుంచి అనంతపురంలోని తెలుగు మహిళా నేతల ఇళ్లలో సోదాలు చేశారు. వాల్మీకి ప్రియాంక ఆచూకీ కోసం గాలించారు. చివరికి బంధువుల ఇంట్లో ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు.. ప్రియాంకను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రాత్రి పది గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ప్రియాంక.

ప్రియాంక ఆత్మహత్యాయత్నానికి పోలీసుల వేధింపులే కారణమని చెబుతున్నారు. అసెంబ్లీలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల తీరును టీడీపీ మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు. దీంతో ఎవరైతే మహిళా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారో వారిపై కేసులు పెట్టారు. బుధవారం టీడీపీ మహిళా నేతలను పోలీసు స్టేషన్‌కు రప్పించారు, ఇవాళ మరోసారి రావాలంటూ చెప్పారు. కాని, నిన్న తెల్లవారుజాము నుంచే మహిళా నేతల ఇళ్లలో సోదాలు మొదలుపెట్టారంటున్నారు బాధితులు. డబ్బులు తీసుకుని వైసీపీ నేతలపై మాట్లాడారా, ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చారంటూ సీఐ వేధించారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే మహిళా నేత ప్రియాంక పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారంటున్నారు స్థానిక టీడీపీ నేతలు.

డీఎస్పీ వీరరాఘవరెడ్డి నేతృత్వంలో.. ప్రతి టీడీపీ మహిళా నేత ఇంటికి ఇద్దరు సీఐలు, ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీసులు వెళ్లారంటున్నారు టీడీపీ నేతలు. ఇంట్లోకి వెళ్లి అందరి వద్ద ఉన్న సెల్‌ఫోన్లనూ తీసుకున్నారని చెబుతున్నారు. విషయం తెలిసి అనంతపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు పెద్దఎత్తున మహిళా నేతల ఇళ్ల వద్దకు వచ్చారు. అయితే, టీడీపీ లీడర్లు లోపలకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. పోలీసుల తీరును నిరసిస్తూ ఇళ్ల ముందే బైఠాయించారు.

పోలీసులు, వైసీపీ నేతలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఓవైపు ఆందోళన చేస్తున్నా సరే.. పోలీసులు మాత్రం 4 గంటలపాటు మహిళా నేతల ఇళ్లలోనే ఉండి.. అభ్యంతరకర ప్రశ్నలతో వేధించారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా డబ్బు, బంగారం, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు పరిశీలించి పంచనామా చేసిన పోలీసులు.. మీడియా సమావేశంలో ఎందుకు మాట్లాడారు? ఎవరైనా డబ్బులిచ్చి మాట్లాడించారా? ఎంత డబ్బు ఇచ్చారంటూ వేధించారని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story