Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది బేసిన్లోని జూరాల, సుంకేసుల వంటి ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 204.78 టీఎంసీలకు చేరింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 2,29,743 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నిండిపోవడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2,48,900 క్యూసెక్కుల నీటిని ఆరు గేట్ల ద్వారా మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విడుదల చేస్తున్నారు. వర్షాలు ఇంకా కొనసాగితే, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని, మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com