Ruia Hospital High Court : తిరుపతి రుయా ఆక్సిజన్ మరణాలపై హైకోర్టులో విచారణ
Ruia Hospital High Court : తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23మంది కోవిడ్ పేషెంట్లు మరణించటంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం,ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన చోటుచేసుకుందని పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజి వాదనలు వినిపించారు. ఘటనపై ఇప్పటివరకు కనీసం FIR కూడా నమోదు కాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారో ఇంతవరకు స్పష్టత లేదని, మరణించిన వారికి ప్రకటించే ఎక్స్ గ్రేషియా లో ప్రభుత్వం అసమానతలు పాటిస్తుందని పిటిషనర్ ఆరోపించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతులకు కోటి రూపాయలు, తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనలో మృతులకు 10 లక్షలు ప్రకటించారని, ఇష్టం వచ్చినట్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించడానికి ఇది రాచరికం కాదన్నారు. ప్రభుత్వం వీటిపై మార్గదర్శకాలు విడుదల చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు విచారణలో తేలిందని ప్రభుత్వం ఒప్పుకుంది. రుయా ఆసుపత్రి ఘటనలో ఆక్సిజన్ అందక చనిపోయారా?ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యమో తేల్చాల్సిన బాధ్యత ఉందన్న హైకోర్టు… కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వం, పోలీసులు,ఆసుపత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com