AP: అమరావతికి మరో దిగ్గజ సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైనదిగా గుర్తింపు పొందిన ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. జంషెడ్పుర్ ప్రధాన కేంద్రంగా నడిచే XLRI.. భారత్లో ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలోనే తుళ్లూరు మండలం ఐనవోలులో ఈ సంస్థకు 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. 2018 జూన్లో ఒప్పందం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో జగన్ సర్కారు దెబ్బకు ఈ విద్యా సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుంది. తాజాగా మళ్లీ చంద్రబాబు సర్కారు కొలువుదీరడంతో తమ ప్రాంగణాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఎక్స్ఎల్ఆర్ఐ ముందుకొచ్చింది. రూ.250 కోట్లతో అమరావతిలో అతిపెద్ద ప్రాంగణాన్ని ఎక్స్ఎల్ఆర్ఐ నిర్మించబోతోంది.
నిర్మాణం పూర్తయితే ఈ ప్రతిష్ఠాత్మక మేనేజ్మెంట్ స్కూల్ ప్రాంగణంలో 5వేల మందికి పైగా రాష్ట్ర, దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులు యూజీ, పీజీ కోర్సులు చదివేందుకు వెసులుబాటు కలుగుతుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో భూములు కేటాయించినా కార్యకలాపాలు ప్రారంభించని దిగ్గజ సంస్థలతో ప్రస్తుతం మళ్లీ జరుపుతున్న సంప్రదింపులు ఫలిస్తున్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా చంద్రబాబు సూచనలతో సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో మళ్లీ దిగ్గజ సంస్థలతో చర్చలు ఆరంభించారు.
అమరావతికి సహకరించాలి
అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సహకరించాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను చంద్రబాబు కోరారు. ఏపీకి సంబంధించి పలువురు జాతీయ రహాదారుల నిర్మాణానికి సంబంధించి సీఎంతో విస్తృతంగా చర్చించానని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీ తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేందుకు సంసిద్ధంగా ఉందని.. రాష్ట్రాన్ని సుసంపన్నమైన, అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలమనే విశ్వాసం తనకుందని చంద్రబాబు తెలిపారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో జరిపిన భేటీలో సహకార సమాఖ్య స్ఫూర్తితో చర్చలు జరిగాయన్నారు. కేంద్ర వ్యవసాయ శివరాజ్ సింగ్ చౌహాన్, పెట్రోలియం మంత్రి హర్దీ్పసింగ్ పురీతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఉదయం పీయూష్ గోయల్తో అల్పాహార విందు సమావేశంతో తన షెడ్యూల్ను ప్రారంభించిన చంద్రబాబు.. సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. రాత్రికి ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ అధికారులకు విందు ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com