అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ రికార్డుకెక్కింది: యనమల
అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ రికార్డుకెక్కిందని మాజీమంత్రి, టీడీపీ సీనియర్నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏపీలో రెండున్నరేళ్లుగా పెద్దఎత్తున అప్పులు పెరిగాయని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులకు లెక్కా పత్రం లేవని ధ్వజమెత్తారు. రెండేళ్లలో ప్రభుత్వం 2లక్షల 68వేల 835 కోట్ల రూపాయలు అప్పు చేసిందని తెలిపారు. ఇందులో నుంచి 1లక్షా 5వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేశామని ఆర్థిక మంత్రి చెప్పారని యనమల అన్నారు. వాస్తవంగా సంక్షేమానికి 68వేల 632 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. మిగిలిన లక్షా 99 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ప్రభుత్వం కేపిటల్ ఎక్స్పెండీచర్ కోసం 31వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా లక్షా 68 వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని యనమల ప్రశ్నించారు. మిగిలిన మొత్తం ఎక్కడ ఖర్చు చేసినట్టు, ఎవరి జేబులోకి మళ్లించినట్టు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రెవెన్యూ కోసం ఖర్చు చేస్తే ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించినట్టేనని యనమల ధ్వజమెత్తారు. అప్పుగా తెచ్చిన, ఆస్తులు తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ము ఏమవుతోందని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com