AP: YCP నేత‌ల అక్ర‌మ‌ మ‌ద్యం దందా

AP: YCP నేత‌ల అక్ర‌మ‌ మ‌ద్యం దందా
సర్కారు మద్యం దుకాణాల్లోని సరుకును అక్రమంగా తరలిస్తూ సైడ్ బిజినెస్ చేసుకుంటున్నారు YCP కార్యకర్తలు

ఏపీలో ప్రభుత్వ మద్యం వ్యాపారం.. అధికార పార్టీ కార్యకర్తలకు వరంగా మారింది. సర్కారు మద్యం దుకాణాల్లోని సరుకును అక్రమంగా తరలిస్తూ సైడ్ బిజినెస్ చేసుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ తరహా దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. పట్టించుకోవాల్సిన ఆబ్కారీ అధికారులు పత్తా లేకుండా పోయారు.

అవనిగడ్డ ప్రాంతంలో జగన్ సర్కార్ మద్యం షాపులు చీప్ లిక్కర్ సప్లై పాయింట్లుగా మారిపోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కానరాని చీప్ లిక్కర్‌ బెల్టు షాపుల్లో గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తోంది. వైసీపీ నాయకులు వాటాలు పంచుకుని చీప్ లిక్కర్ సొమ్ము దిగమింగుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇద్దరు ముఖ్య నేతల కనుసన్నల్లో మద్యం అక్రమ దందా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు ఏజెంట్లను నియమించుకొని అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది

అధికార పార్టీ నాయకుల సిండికెట్ దెబ్బకు ప్రభుత్వ దుకాణానికి చీప్ లిక్కర్ వచ్చిన అరగంటకే బెల్ట్ షాపులకు చేరిపోతోంది. మద్యం సరుకు మూడు చేతులు మారుతుండటంతో 130 రూపాయలు ఉండే చీప్ లిక్కర్‌.. బెల్టు షాపుల్లో 180 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో సర్కార్‌ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ప్రభుత్వ వైఫల్యమనేనని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దశలవారీగా మద్యం నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఆ పని చేయకపోగా.. సొంత పార్టీ కార్యకర్తలకు మద్యం దందా అప్పగించడం దారుణమంటున్నారు విపక్ష నాయకులు. బెల్టుషాపులను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story