అమరావతి భూములు చూపించి భారీగా అప్పు చేసిన జగన్ సర్కార్ ..!
జగన్ సర్కార్ అమరావతిని కూడా అమ్మేస్తోందా? రాజధాని భూములు చూపించి అప్పు చేసిందా? తిరిగి ఆ భూములనే అమ్మడం ద్వారా అప్పు తీర్చేస్తామని హామీ ఇచ్చిందా? ఇవన్నీ సందేహాలు కాదు పక్కా ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి లంక దినకర్. అమరావతిలో 30వేల ఎకరాల భూములు ఉన్నాయని చూపించి ఏకంగా 3వేల కోట్ల రూపాయల అప్పుచేసిందన్నారు. పైగా జగన్ ప్రభుత్వం రద్దు చేసిన అమరావతి మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద ఈ అప్పు తేవడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు బీజేపీ నేత దినకర్.
జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను తెరమీదకు తెచ్చిన తరువాత సీఆర్డీఏను రద్దు చేసింది. దాని స్థానంలో AMRDA తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టంలో సాంకేతిక లోపాలు ఉన్న కారణంగా.. AMRDAను రద్దు చేస్తూ తిరిగి సీఆర్డీఏను అమల్లోకి తీసుకొచ్చింది. ఇదంతా జరిగింది నవంబర్లోనే. కాని, విచిత్రంగా రద్దైపోయిన AMRDA నుంచి, అమరావతి భూములను చూపించి, ఏకంగా 2 వేల 994 రూపాయలు అప్పు చేసిందన్నారు జగన్ ప్రభుత్వం.
ఈ అప్పును అమరావతి భూములు అమ్మడం ద్వారా తీరుస్తామని హామీ ఇచ్చిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపిస్తున్నారు.3 వేల కోట్లు అప్పు తెచ్చుకోవడం కోసం అమరావతిలో నిర్మించిన ప్రభుత్వ అధికారిక భవనాలను మార్జిన్ మనీగా చూపించింది జగన్ ప్రభుత్వం. అంటే, అమరావతిలో స్మశానం తప్ప ఏమీ లేదని వాదిస్తూ వచ్చిన జగన్ సర్కారే.. అమరావతిలో నిర్మించిన బిల్డింగులను మార్జిన్ మనీగా చూపించారన్నారు.
మార్జిన్ మనీని చూపించడంలోనూ జగన్ ప్రభుత్వం గజకర్ణ గోకర్ణ జిమ్మిక్కులు ఉపయోగించిందని విమర్శించారు. CRDA కింద ఉన్న 765 కోట్ల రూపాయల మార్జిన్ మనీని AMRDA కింద ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. నవంబర్లో రద్దైపోయిన AMRDA కింద.. 765 కోట్ల రూపాయల మార్జిన్ మనీ చూపించి, డిసెంబర్ 9న 3వేల కోట్లు అప్పు ఎలా తెచ్చారని నిలదీశారు లంక దినకర్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com