YCP : వెలవెలబోయిన వైసీపీ సాధికార సభ

వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన సాధికారత బస్సు యాత్రకు ప్రజలు కరవయ్యారు. బస్సు యాత్ర సభకు ప్రజలు లేక వెలవెల పోయింది. చెన్నూరు- కొండపేట వంతెనపై... వైసీపీ సాధికారత బస్సు యాత్ర సభ నిర్వహించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా, మేరుగ నాగార్జున, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఇతర నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ ఉంటుందని ప్రజలను బలవంతంగా సభ ప్రాంగణానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే మహిళలంతా సభ నుంచి వెళ్లిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగిస్తుండగానే ఇంటిదారి పట్టారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు ఎదురుగా భారీ సంఖ్యలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. పదుల సంఖ్యలో కనిపించిన జనానికి..నేతలు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వంతెన పొడవునా భారీ స్థాయిలో కుర్చీలు ఖాళీగా కనిపించడంపైపార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు చెన్నూరు -కొండపేట వంతెనను ఉదయం నుంచి దిగ్భంధం చేయడంతో...... చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com