SHARMILA: ఎవరైనా అమ్మ మీద కేసు వేస్తారా? : షర్మిల

మాజీ సీఎం జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీని పై తాజాగా షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమేనని, కానీ అందరూ అమ్మల మీద కోర్టుల్లో కేసులు వేయరు కదా? ఇలా కోర్టుకు లాగరు కదా? అన్నారు. చెల్లెళ్ల మీద కేసులు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. అయితే, జగన్పై లీగల్ ఫైట్ చేస్తారా అనే ప్రశ్నకు షర్మిల సమాధానం ఇవ్వలేదు.
ఆ మాటలు పచ్చి అబద్దం
తనపై ప్రేమతో జగన్ షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం శతాబ్దపు పెద్ద జోక్ గా అభివర్ణించారు. ఆస్తుల వ్యవహారంలో ఆమె.. జగన్కు పలు ప్రశ్నలు సంధించారు. ఆస్తులపై ప్రేమతో రక్త సంబంధం, అనుబంధాలను మార్చారని... కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారని.. ఆస్తులను లాక్కోవడానికి కారణంగా చెబుతున్నారు కానీ వాస్తవం కాదన్నారు. ఈడీ కేసులు, బెయిల్ రద్దవుతుందని కారణాలు చెబుతున్నారని... సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదన్నారు.
జగన్ సార్ అంటూ సెటర్లు
తమ కుటుంబంలో తలెత్తిన ఆస్తుల వివాదంపై స్పందించిన వైఎస్ షర్మిల.. గొడవలు పెట్టుకోవాలని తమ ఉద్దేశం కాదని అన్నారు. సామరస్యంగా, నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని తమకు తెలుసని చెప్పారు. ఆస్తి గొడవలు సామాన్యమని.. అన్ని కుటుంబాల్లో జరిగేది అంటూనే.. తల్లిని, చెల్లిని వైఎస్ జగన్ కోర్టుకు ఈడ్చారని పేర్కొన్న షర్మిల.. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లిపై ప్రేమతోనే జగన్ షేర్లు ట్రాన్స్ఫర్ చేశారు అనేది పచ్చి అబద్ధమని షర్మిల తెలిపారు. సర్వసతీ కంపెనీకి చెందిన రూ.32 కోట్ల విలువైన భూమిని ఈడీ అటాచ్ చేసింది కానీ.. కంపెనీ షేర్లను ఎప్పుడూ అటాచ్ చేయలేదని షర్మిల తెలిపారు. ఏ కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసినా.. ఏ సమయంలోనైనా షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2016లో ఈడీ అటాచ్ చేసినందున షేర్ల బదిలీ చేయకూడదని.. ఒకవేళ షేర్లు ట్రాన్స్ఫర్ చేస్తే బెయిల్ రద్దవుతుందని జగన్ వాదిస్తున్నారని తెలిపిన షర్మిల.. 2019లో 100శాతం వాటాలు బదలాయిస్తామని ఎంవోయూపై ఎలా సంతకం చేశారని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com