YSRCP : గవర్నర్ ప్రసంగానికే వైసీపీ అడ్డంకులు.. ఇదేం తీరు..

వైసీపీ నేతల తీరు ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్య వ్యతిరేకమే అని బయటపడుతూనే ఉంది. నేడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకుంటూ గడిపిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ప్రజల విమర్శలతో ఎట్టకేలకు సభకు హాజరయ్యారు. అయితే వస్తూనే తమ తీరును మరోసారి బయటపెట్టుకున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభ స్పీచ్ ఇచ్చారు. కానీ దానికి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు పడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ డిమాండ్లు చేశారు. అయినా సరే గవర్నర్ ప్రసంగం ఆపకుండా కొనసాగించారు.
దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తూ బయటకు వెళ్లిపోయారు. వాళ్ల తీరు ఎలా ఉందంటే.. ఏకంగా గవర్నర్ నే అవమానిపరిచేలా ఉందంటున్నారు నెటిజన్లు. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే.. గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత అయినా అడగాలి కదా. వైసీపీకి ఎలాగూ అర్హత లేదు. అయినా సరే అడుగుతున్నారు. కానీ అడగటానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది.
అంతే గానీ గవర్నర్ మాట్లాడుతుండగా ఇలాంటి వింత డిమాండ్లు చేయడం ఏంటని కూటమి నేతలు మండిపడుతున్నారు. చట్ట సభలపై కనీస గౌరవం ఉన్న వారు ఇలా అస్సలు చేయరని చెబుతున్నారు. జగన్ ఒకసారి సీఎంగా పనిచేశారు. అలాంటప్పుడు సభ గౌరవాన్ని కాపాడేలా ఆయన ప్రవర్తన ఉండాలి గానీ.. ఇలా అవమానించేలా కాదని అంటున్నారు. మొత్తానికి జగన్ అండ్ వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు మరోసారి వివాదాస్పదం అవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
