Yuvagalam : రైస్ మిల్లర్ల పేరుతో వైసీపీ నేతల దోపిడీ : లోకేష్

Yuvagalam : రైస్ మిల్లర్ల పేరుతో వైసీపీ నేతల దోపిడీ : లోకేష్
X
వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. అధికార పార్టీకి కొమ్ము కాసే వారికే విత్తనాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు

టీడీపీ యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర అశేషజనవాహిని మధ్య కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ప్రజల నుండి అపూర్వస్పందన లభిస్తోంది. లోకేష్‌తోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అడుగులోఅడుగు వేస్తున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకుసాగుతున్న లోకేష్‌.. స్థానిక సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నారు.

జగన్ తీరుపై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. అధికార పార్టీకి కొమ్ము కాసే వారికే విత్తనాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 24వ రోజు పాదయాత్రలో భాగంగా మడిబాకలో రైతులతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు కొత్తవీరాపురం స్థానికులతో లోకేష్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని గ్రామస్తులు లోకేష్‌కు మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్రంలో జగన్ ఆగడాలు శృతిమించిపోయాయని మండిపడ్డారు. ప్రజల తరపున పోరాడుతున్న తెలుగుదేశం గొంతును జగన్ నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

కాసేపట్లో మునగలపాలెం ప్రజలతో లోకేష్‌ సమావేశంకానున్నారు. అనంతరం వికృతమాలలోని స్థానికులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. ఆతర్వాత పాపానాయుడుపేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ కైకాల సామాజిక వర్గీయులతో లోకేష్‌ భేటీ కానున్నారు. అనంతరం రేణిగుంట మండలం జీలపాలెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడే లోకేష్‌ రాత్రి బస చేయనున్నారు.

Tags

Next Story