Auto Sales Report : మారుతి నుంచి మహీంద్రా దాకా.. నవంబర్లో ఏ కంపెనీకి లాభం? ఎవరికి నష్టం?

Auto Sales Report : ప్రతి నెల మాదిరిగానే నవంబర్ 2025 విక్రయాల గణాంకాలను ఆటోమొబైల్ కంపెనీలు విడుదల చేశాయి. పండుగ సీజన్ ముగిసినప్పటికీ ఈ గణాంకాలు కొన్ని కంపెనీలకు రికార్డు స్థాయి అమ్మకాలను సూచిస్తున్నాయి. మార్కెట్లో ఏ కంపెనీ వాహనాలకు డిమాండ్ ఉంది. వినియోగదారులు ఏ బ్రాండ్పై ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారో ఈ డేటా స్పష్టం చేస్తుంది. నవంబర్ నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, మారుతి సుజుకి వంటి కంపెనీలు బలమైన వృద్ధిని కనబరచగా, బజాజ్ ఆటో మాత్రం దేశీయ ద్విచక్ర వాహన విక్రయాలలో స్వల్పంగా తగ్గింది.
మహీంద్రా & మహీంద్రా విక్రయాల్లో 19% వృద్ధి
మహీంద్రా అండ్ మహీంద్రా నవంబర్ 2025లో అద్భుతమైన విక్రయాలను నమోదు చేసింది. కంపెనీ మొత్తం విక్రయాలు (కార్పొరేట్, ప్యాసింజర్ వెహికల్స్) గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 19 శాతం పెరిగి 92,670 యూనిట్లుగా నమోదయ్యాయి. ముఖ్యంగా ప్యాసింజర్ వెహికల్ విభాగంలో దేశీయ మార్కెట్లో 56,336 వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది నవంబర్లో విక్రయించిన 46,222 వాహనాల కంటే 22 శాతం ఎక్కువ. కమర్షియల్ వాహనాల దేశీయ విక్రయాలు కూడా 17 శాతం పెరిగి 24,843 యూనిట్లుగా నమోదయ్యాయి. మహీంద్రా అధికారి విజయ్ నక్రా మాట్లాడుతూ.. సెప్టెంబర్, అక్టోబర్లో పండుగల కారణంగా వచ్చిన 27 శాతం వృద్ధి నవంబర్లో కూడా కొనసాగిందని తెలిపారు.
మారుతి సుజుకి, టయోటా అగ్రస్థానంలో
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా నవంబర్లో మొత్తం 2,29,021 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 1,81,531 యూనిట్లను విక్రయించింది. దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో మారుతి 1,70,971 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది నవంబర్లో ఇది 1,41,312 యూనిట్లుగా ఉంది. మారుతి తన మార్కెట్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది.
మరోవైపు, టయోటా కంపెనీ కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. టయోటా మొత్తం హోల్సేల్ విక్రయాలు గత నెలలో ఏడాదికి ఏడాది 19 శాతం పెరిగి 30,085 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్ 2024లో కంపెనీ 25,182 యూనిట్లను విక్రయించింది. జీఎస్టీ కోతల తర్వాత పండుగల సీజన్లో మంచి అమ్మకాలు కొనసాగడం, ఇటీవల విడుదల చేసిన అర్బన్ క్రూజర్ హైరైడర్ ఏరో ఎడిషన్, ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ వంటి మోడళ్లు ఈ వృద్ధికి సహాయపడ్డాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వరిందర్ వాధ్వా తెలిపారు.
బజాజ్ ఆటోకు మిశ్రమ ఫలితాలు
బజాజ్ ఆటోకు నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దేశీయ మార్కెట్లో బజాజ్ టూవీలర్ విక్రయాలు 1 శాతం తగ్గి 2,02,510 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది నవంబర్లో కంపెనీ 2,03,611 యూనిట్లను విక్రయించింది. అయితే, ఎగుమతితో సహా వాహనాల మొత్తం హోల్సేల్ విక్రయాలు 8 శాతం పెరిగి 4,53,273 యూనిట్లుగా నమోదయ్యాయి. కమర్షియల్ వాహనాలతో సహా కంపెనీ మొత్తం దేశీయ విక్రయాలు కూడా 3 శాతం పెరిగి 2,47,516 యూనిట్లుగా నమోదయ్యాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

