Bharat Taxi : డ్రైవర్లే ఓనర్లు.. ఓలా, ఊబర్, రాపిడోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు భారత్ టాక్సీ ఎంట్రీ!

Bharat Taxi : కో ఆపరేటివ్ ఫార్ములా పై స్థాపించబడిన భారత్ టాక్సీ రైడ్-హేలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దీని పైలట్ సర్వీసులు సౌరాష్ట్ర (గుజరాత్), ఢిల్లీలలో ప్రారంభమయ్యాయి. ఓలా, ఊబర్, రాపిడో వంటి కంపెనీల ఆధిపత్యం ఉన్న ఈ రంగంలో భారత్ టాక్సీ బలమైన పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్లాట్ఫామ్ పూర్తిగా కో ఆపరేటివ్ మోడల్లో పనిచేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో డ్రైవర్లే స్వయంగా యజమానులుగా ఉంటారు.
జీరో కమీషన్ మోడల్
సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే సంస్థ ఆధ్వర్యంలో జూన్ 2025లో ప్రారంభమైన భారత్ టాక్సీ, పూర్తి సహకార పద్ధతిలో పనిచేస్తుంది. ఇది నమ్మ యాత్రి ప్లాట్ఫామ్ మాదిరిగానే జీరో కమీషన్ మోడల్ను అనుసరిస్తుంది. అంటే ఒక రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం డ్రైవర్కే చెందుతుంది. ప్లాట్ఫామ్కు కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. అమూల్, నాబార్డ్, ఇఫ్కో వంటి ఎనిమిది ప్రముఖ సహకార సంస్థల మద్దతుతో నడుస్తున్న భారత్ టాక్సీలో ఆటో, క్యాబ్, బైక్ టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అతిపెద్ద విషయం ఏమిటంటే కేవలం 10 రోజుల్లోనే 51,000 మందికి పైగా డ్రైవర్లు ఈ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకున్నారు. దీని ద్వారా భారత్ టాక్సీ ప్రపంచంలోనే అతిపెద్ద సహకార టాక్సీ ప్లాట్ఫామ్గా అవతరించింది. అమెరికాలోని న్యూయార్క్లో ఇలాంటి కో-ఆపరేటివ్ సర్వీస్ ఉన్నప్పటికీ, అందులో కేవలం 4,000 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
డ్రైవర్లే సారథులు
భారత్ టాక్సీలో పనిచేసే డ్రైవర్లను సారథులు అని గౌరవంగా పిలుస్తారు. ఈ విధంగా డ్రైవర్లకు ప్రత్యేక హోదా లభిస్తుంది. ఈ సహకార టాక్సీ నెట్వర్క్లో ఈ సారథులు సహ-యజమానులుగా, వాటాదారులుగా ఉంటారు. సహకార్ సే సమృద్ధి అనే ప్రభుత్వ నినాదం ఆధారంగా భారత్ టాక్సీ నడుస్తోంది. సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్కు వచ్చే లాభం ఏదైనా ఉంటే, దానిని కూడా డ్రైవర్లకే తిరిగి పంచుతారు. సంస్థ పాలక మండలిలో డ్రైవర్ల తరపున ఇద్దరు ప్రతినిధులు కూడా ఉంటారు. ప్రస్తుతం భారత్ టాక్సీ బీటా వెర్షన్ యాప్లు ఢిల్లీ , గుజరాత్లోని సౌరాష్ట్రలో అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఈ సేవలు బెంగళూరుతో సహా మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

