CARGO TERMINAL: దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కార్గో టెర్మినల్ ప్రారంభం

హరియాణా రాష్ట్రంలోని మారుతీ సుజుకీ మానేసర్ ప్లాంట్ వద్ద దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతి శక్తి కార్గో టెర్మినల్ను మంగళవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. ఈ టెర్మినల్ ద్వారా కంపెనీ తయారుచేసిన వాహనాలను దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లకు రైల్వే మార్గంలో వేగంగా, సమర్థవంతంగా తరలించేందుకు అవకాశముంటుంది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచే దిశగా తీసుకున్న ఈ చర్య రవాణా వ్యవస్థలో ఒక కీలక మౌలిక భద్రతగా నిలుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ టెర్మినల్ అభివృద్ధి హరియాణా రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (HRIDC) ఆధ్వర్యంలో సాగుతోంది. హరియాణా ఆర్బిటల్ రైల్ కారిడార్లో భాగంగా మానేసర్ ప్లాంట్ను పత్లీ రైల్వే స్టేషన్తో 10 కిలోమీటర్ల ప్రత్యేక రైల్వే లింక్ ద్వారా అనుసంధానించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.800 కోట్ల వ్యయం అంచనా వేసినప్పటికీ, అందులో రూ.684 కోట్లను HRIDC భరించగా, మిగిలిన మొత్తాన్ని మారుతీ సుజుకీ ఖర్చు చేసింది. కొత్త టెర్మినల్లో ఏడాదికి సుమారు 4.5 లక్షల వాహనాలను లోడ్ చేసే సామర్థ్యం ఉంది.
ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఎండీ మరియు సీఈఓ హిసాషి టకూచీ మాట్లాడుతూ, ప్రస్తుతం రైళ్ల ద్వారా కంపెనీ కార్లను పంపే శాతం 24గా ఉన్నప్పటికీ, 2030-31 నాటికి దీన్ని 35 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2014-15లో ఈ శాతం కేవలం 5 మాత్రమేనని గుర్తుచేశారు. కొత్త టెర్మినల్ వల్ల రవాణా సామర్థ్యం 40 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రైళ్ల ద్వారా కార్లను పంపడం వల్ల ఏడాదికి 1.75 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని, 6 కోట్ల లీటర్ల ఇంధనాన్ని పొదుపు చేయగలమని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com