CARS: మళ్లీ పెరిగిన కార్ల ధరలు

ప్రతి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పలు ఉత్పత్తులు, సేవల ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగనుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో పలు కార్ల బ్రాండ్లు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పటికే ఈ పెంపును అగ్రశ్రేణి వాహన తయారీ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. సాధారణంగా, ఆటోమొబైల్ కంపెనీలు సంవత్సరానికి కనీసం రెండుసార్లు వాహనాల ధరలను పెంచడం పరిపాటిగా మారింది. ఈ క్యాలెండర్ సంవత్సరం ఆరంభంలో ఒకసారి రేట్లు పెంచిన ప్రముఖ కంపెనీలు, ఇప్పుడు మరోసారి ధరలను పెంచింది.
ఏ కంపెనీ ఎంత పెంచింది?
మన దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలు ప్రయాణీకుల వాహనాల (Passenger Vehicles) ధరలను 3% నుంచి 4% వరకు పెంచనున్నాయి. ఇప్పటికే జనవరి 2025లో ఒకసారి కార్ల ధరలు 2% నుంచి 4% వరకూ పెరిగాయి. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మరోసారి వాహనాల ధరలు పెరుగనున్నాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా లాంటి ప్రధాన కంపెనీలతో పాటు లగ్జరీ బ్రాండ్ BMW కూడా ఉంది.
ప్రముఖ బ్రాండ్లు, ధరల పెంపు వివరాలు:
మారుతి సుజుకి – ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్లకు 4% వరకూ పెంపు. జనవరిలోనూ ఇదే శాతం మేర పెరిగింది.
హ్యుందాయ్ మోటార్స్ – జనవరిలో రూ. 25,000 వరకు పెంచిన ధరలను, ఏప్రిల్లో మరో 3% మేర పెంచనుంది.
టాటా మోటార్స్ – జనవరిలో 3% పెంచిన ఈ సంస్థ, ఏప్రిల్లో మరోసారి ధరల పెంపును ప్రకటించింది.
మహీంద్రా & మహీంద్రా – జనవరిలో 3% పెంచిన ఈ సంస్థ, ఇప్పుడు కూడా అదే శాతం పెంచనుంది.
కియా ఇండియా – గతంలో 2% పెంచిన ధరలను, ఇప్పుడు 3% వరకు పెంచనుంది.
BMW గ్రూప్ ఇండియా – లగ్జరీ కార్ల ధరలను కూడా 3% పెంచనున్నట్లు వెల్లడించింది.
కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
వాహన ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఉత్పత్తి వ్యయాల్లో పెరుగుదల. ముడిసరుకు ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవడం, ముడిపదార్థాల లభ్యత సమస్యలు, మెరుగైన టెక్నాలజీ జోడించడం వంటివి కంపెనీలపై ఆర్థిక భారం పెంచుతున్నాయి. ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై మోపేందుకు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com