Digital Payment Fraud : ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కొత్త ఏఐ టెక్నాలజీ.

Digital Payment Fraud : భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ వినియోగదారులలో ఒకటి. పెద్ద పెద్ద షాపుల నుండి చిన్న పండ్లు, కూరగాయల దుకాణాల వరకు ఆన్లైన్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉంది. నేడు భారతదేశంలో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు డిజిటల్ పేమెంట్స్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఒకవైపు డిజిటల్ చెల్లింపులు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతుంటే, మరోవైపు ఆన్లైన్ మోసాల కేసులు కూడా పెరిగాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. 2024 సంవత్సరంలో రూ.36,014 కోట్ల డిజిటల్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మోసాలను అరికట్టడానికి దేశంలోని రెండు పెద్ద బ్యాంకులు కొత్త AI ఆధారిత సిస్టమ్పై పనిచేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటున్నాయి. దీని ద్వారా అనుమానాస్పద లావాదేవీలను రియల్ టైమ్లో అడ్డుకోగలుగుతారు.
ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కలిసి ఒక సిస్టమ్ను తయారు చేస్తున్నాయి. ఇందులో AI, మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి రియల్ టైమ్లో (మీరు డిజిటల్ చెల్లింపులు చేస్తున్న సమయంలోనే) అలాంటి మోసాలను గుర్తించి అడ్డుకోగలుగుతాయి. ఈ సిస్టమ్ను తయారు చేయడానికి ప్రారంభ దశలో రెండు బ్యాంకులు చెరో రూ.10కోట్లు పెట్టుబడి పెడతాయి. అంతేకాకుండా, దేశంలోని ఇతర ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులవుతాయి.
ప్రస్తుతం బ్యాంకులు RBI మ్యూల్హంటర్ AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. మోసపూరితంగా పొందిన డబ్బును లావాదేవీల కోసం ఉపయోగించే ఖాతాల సమాచారాన్ని బ్యాంకులు కనుగొని వాటిపై చర్యలు తీసుకుంటాయి. అలాంటి ఖాతాలను మ్యూల్ అకౌంట్స్ అంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ మ్యూల్హంటర్ AIని అభివృద్ధి చేసింది. కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ ఒక ప్రకటనలో ఇలా తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం ఒక డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారమ్పై పనిచేస్తోంది. దీనిని ఉపయోగించి ఆన్లైన్ మోసాలను రియల్ టైమ్లో పట్టుకోగలరు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

