Cyber Crime : అపరిచితుల లింక్స్ క్లిక్ చేస్తే పోయినట్లే.. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఇవి పాటించండి.

Cyber Crime : దేశంలో డిజిటల్ పేమెంట్స్ శకం వేగంగా విస్తరిస్తోంది. యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం స్మార్ట్ వాచ్లు, కార్ల ద్వారా పేమెంట్స్ చేసేందుకు కొత్త సిస్టమ్స్ తీసుకొస్తోంది. టెక్నాలజీ ఎంతగా పెరుగుతోందో, సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా అంతే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ముఖ్యంగా నకిలీ స్క్రీన్షాట్లు, ఫిషింగ్ వంటి పద్ధతులతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ కొత్త రకం సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి? నిపుణులు సూచిస్తున్న కీలకమైన చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
టెక్నాలజీ పెరిగిన తర్వాత, సైబర్ నేరాలు చేసేవారు ముఖ్యంగా వృద్ధులను టార్గెట్గా చేసుకుంటున్నారు. ఈ మోసాల నుంచి తప్పించుకోవడానికి రూపాయ్ పైసా.కామ్ వ్యవస్థాపకులు ముఖేష్ పాండే, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ కనిష్క్ గౌర్ వంటి నిపుణులు ముఖ్యమైన సూచనలు చేశారు.
సైబర్ నేరాల నుంచి రక్షణకు పాటించాల్సిన కీలకమైన నియమాలు..
అపరిచిత లింకులు వద్దు: మీ KYC చేయాలి లేదా మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతోంది అంటూ అపరిచిత నంబర్ల నుండి ఫోన్ కాల్స్ లేదా లింక్లు వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
గుర్తింపు వివరాలు షేర్ చేయవద్దు: మీ ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు CVV నంబర్, పిన్ నంబర్ వంటి రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్: మీ డిజిటల్ చెల్లింపుల కోసం కేవలం OTP బెస్డ్ సేఫ్టీ కాకుండా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ పద్ధతిని తప్పక ఎనేబుల్ చేసుకోవాలి.
ఫోన్ ఫార్వార్డింగ్: మీ ఫోన్ను అపరిచితుల చేతికి ఇవ్వకూడదు. కొన్నిసార్లు వారు మీ ఫోన్కు ఫార్వార్డింగ్ సెట్ చేసి, మీ OTP లను లేదా పిన్లను వేరే ఖాతాలకు బదిలీ చేయవచ్చు.
పబ్లిక్ ప్రదేశాల్లో బ్లూటూత్ ఆఫ్ చేయాలి. ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కనిష్క్ గౌర్ పబ్లిక్ ప్లేస్లలో తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన జాగ్రత్త చెప్పారు.
బ్లూటూత్, వై-ఫై ఆఫ్: మీరు పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, మీ ఫోన్ బ్లూటూత్, వై-ఫై సేవలను ఆఫ్ చేసి ఉంచండి. కొంతమంది మోసగాళ్లు బ్లూటూత్ ఆన్లో ఉన్నప్పుడు ప్రత్యేక పరికరాల సహాయంతో మీ ఫోన్ వివరాలను దొంగిలించడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.
నకిలీ స్క్రీన్షాట్ మోసాల గురించి తెలుసుకోండి
ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న మోసాలలో ఒకటి నకిలీ స్క్రీన్షాట్
మోసం జరిగే విధానం: మోసగాళ్లు ముందుగా మీ UPI ID పొందడానికి మీ ఖాతాకు రూ.1 లేదా రూ.2 మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత, వారు తాము పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పి, దాని నకిలీ స్క్రీన్షాట్ను మీకు పంపిస్తారు. తమ ఖాతా నుండి డబ్బు వెళ్లిపోయిందని, కానీ మీకు చేరలేదని నమ్మించి, తిరిగి ఆ డబ్బును వారికి పంపమని అడుగుతారు. మీ ఖాతాలో డబ్బు జమ అయ్యిందా లేదా అని ధృవీకరించుకోకుండా, కేవలం స్క్రీన్షాట్ను చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లింపు చేయకూడదు. యూపీఐ ద్వారా డబ్బు తక్షణమే బదిలీ అవుతుంది. పేమెంట్ హోల్డులో ఉంది లేదా ఫెయిల్ అయింది అని వస్తే, దాని ఆధారంగా తదుపరి లావాదేవీలు చేయకూడదు.
QR కోడ్ మోసాలు
మార్కెట్లో QR కోడ్ ద్వారా కూడా మోసాలు జరుగుతున్నాయి. దుకాణాల వద్ద ఉన్న అసలు QR కోడ్లను మోసగాళ్లు మార్చేస్తారు లేదా వారి పేరుతో ఉన్న కోడ్లను అతికిస్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత అది వేరే ఖాతాకు వెళ్తుంది. చెల్లింపు చేసే ముందు, మీరు QR కోడ్ను స్కాన్ చేసినప్పుడు వచ్చే పేరు, నంబర్ను ఆ దుకాణం లేదా వ్యక్తిని అడిగి కన్ఫాం చేసుకోవాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com