INDIA:ఆర్థిక ఎదుగుదల దిశగా భారత్

INDIA:ఆర్థిక ఎదుగుదల దిశగా భారత్
X
భారత్‌ ఆర్థిక వృద్ధికి బలమైన దిశ: ఆర్‌బీఐ వార్షిక నివేదిక

భారత్‌ ఇటీవలే జపాన్‌ను అధిగమించి, ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఆర్‌బీఐ) 2024-25 వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక పరిస్థితిపై అంచనాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025-26) భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని, దీని ద్వారా స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అంతరాయాలు, సరఫరా గొలుసులలో ఆటంకాలు, వాతావరణ సంబంధిత అనిశ్చితులు వంటి సవాళ్లు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంకా, ప్రభుత్వం మౌలిక వృద్ధి, వినియోగదారుల విశ్వాసం, వ్యాపారాలపై నమ్మకాన్ని పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో వృద్ధి నిరంతరంగా కొనసాగుతుందని వివరించింది. వ్యవసాయ రంగానికి సంబంధించి 2025-26లో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని, నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఉంటాయని, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకురావలసిన ఉత్పాదకత ఆధారిత విధానాలు కీలకంగా మారతాయని నివేదిక పేర్కొంది.

తయారీ రంగానికి బలమైన భవిష్యత్‌

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ‘నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్’తో పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాలు తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. అయితే, టారిఫ్ విధానాలలో అనేక మార్పులు మార్కెట్‌లో అప్పుడప్పుడు అస్థిరతలకు దారితీయవచ్చని కూడా పేర్కొంది. భారత్ ఇప్పటికే యూఎస్‌, ఒమన్‌, పెరూ, ఈయూ తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇవి దేశ వృద్ధి రేటుకు బలాన్ని ఇస్తాయని పేర్కొంది.

డిజిటల్ చెల్లింపుల్లో దూసుకుపోతున్న భారత్

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నాయని, ఇది ఆర్థిక వ్యవస్థ పటిమకు సూచనగా నిలుస్తోందని ఆర్‌బీఐ పేర్కొంది. సారాంశంగా, ప్రస్తుతం భారత్‌ ఎదుగుదల దిశగా నిలబడిందని, ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ బలమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. 2025-26లో వ్యవసాయ రంగానికి అవకాశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచే ప్రభుత్వ విధానాలు కూడా అని ఆర్‌బీఐ పేర్కొంది. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి వివిధ కొత్త చొరవలను ప్రకటించారని కూడా వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా వంటివి తయారీ రంగాన్ని మరింత బలపరుస్తాయి. తద్వారా.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

Tags

Next Story