DEAL: రష్యాతో భారత్ రక్షణ ఒప్పందం

భారత రక్షణ రంగ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసేలా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాలను వెలువరించింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ), రష్యా నుండి ఏకంగా 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు ‘యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ’ (ఏఓఎన్) కింద ఆమోదం తెలిపింది. సుమారు 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ రక్షణ ఒప్పందంలో 120 స్వల్ప శ్రేణి, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణులు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వినియోగించిన క్షిపణి నిల్వలను పునరుద్ధరించడంతో పాటు, వైమానిక దళాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళంగా తీర్చిదిద్దడమే ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యం. ఈ మొత్తం ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ‘ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్’ (ఎఫ్టీపీ) మార్గాన్ని ఎంచుకోవడం దేశ భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతోంది.
గత ఏడాది పాకిస్తాన్తో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల సమయంలో ఎస్-400 క్షిపణి వ్యవస్థ తన అద్భుతమైన విశ్వరూపాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. పంజాబ్ సరిహద్దు నుంచి ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు యుద్ధ విమానాన్ని కూల్చివేసి ఈ వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో భారత సైన్యం మోహరించిన ఈ వ్యవస్థ ధాటికి భయపడిన పాక్, తన యుద్ధ విమానాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయబోయే 400 కి.మీ, 200 కి.మీ, 150 కి.మీ, 40 కి.మీ శ్రేణి క్షిపణులు భవిష్యత్తులో పొంచి ఉన్న డ్రోన్ దాడులను, ఆధునిక శత్రు విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి భారత్కు తిరుగులేని బలాన్ని అందించనున్నాయి. ఇప్పటికే ఉన్న ఎస్-400 వ్యవస్థలకు రష్యాకు చెందిన ‘పాంత్సిర్’ స్వల్ప శ్రేణి వ్యవస్థలను కూడా అనుసంధానం చేయడం ద్వారా సరిహద్దుల్లో ఒక అజేయమైన ‘టూ-లేయర్’ రక్షణ కవచం ఏర్పడనుంది.
త్రివిధ దళాల సమగ్ర ఆధునీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైన భారీ నిధులకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా వైమానిక దళం కోసం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ), అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు, నిఘా కోసం హై-ఆల్టిట్యూడ్ శాటిలైట్లను కొనుగోలు చేయనున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి ప్రాధాన్యతనిస్తూ, మెజారిటీ యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేయాలని నిర్ణయించడం దేశీయ రక్షణ పరిశ్రమకు గొప్ప ఊతమివ్వనుంది. నౌకాదళం కోసం అత్యాధునిక పి-8ఐ విమానాలను సమకూర్చుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యం మరింత పెరగనుంది. శత్రువుల సబ్మెరైన్లను వెతికి పట్టుకోవడంలో, సముద్ర మార్గంలో నిఘా ఉంచడంలో ఈ విమానాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. భూతల సైన్యం (ఆర్మీ) బలోపేతం కోసం కూడా భారీ కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా శత్రువుల ట్యాంకులను ధ్వంసం చేసేందుకు విభవ్ యాంటీ-ట్యాంక్ మైన్ల కొనుగోలుతో పాటు, ప్రస్తుతం ఉన్న టీ-72 ట్యాంకులను ఆధునీకరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ దాడులు, అంతరిక్ష యుద్ధ తంత్రాలను ఎదుర్కోవడానికి వీలుగా అత్యాధునిక సాంకేతికతను రక్షణ రంగంలో ప్రవేశపెట్టడం ఒక నూతన అధ్యాయంగా నిలవనుంది. ఎస్-400 క్షిపణుల నుండి రాఫెల్ యుద్ధ విమానాల వరకు అన్ని విభాగాల్లో భారత్ తన స్వయం ప్రతిపత్తిని నిరూపించుకుంటూ శత్రు దేశాలకు గట్టి హెచ్చరికను పంపింది. కేటాయింపులు పూర్తయితే గగనతలంపైకి రావడానికి ఏ శత్రువైనా ఆలోచించాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
