IPHONES: అమెరికాలో 97 శాతం మేడిన్ ఇండియా ఐఫోన్లు

చైనాపై అమెరికా విధించిన టారీఫ్లను ఎదుర్కొనేందుకు యాపిల్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ ఎగుమతులను గణనీయంగా పెంచింది. ఈ ఏడాది మార్చి-మే మధ్య భారత్ నుంచి ఎగుమతి చేసిన ఐఫోన్లలో 97 శాతం అమెరికాకు చేరాయి. గతంలో భారత్ నుంచి ఐఫోన్లు నెదర్లాండ్, బ్రిటన్ వంటి దేశాలకు ఎక్కువగా ఎగుమతయ్యేవి. కానీ ఇప్పుడు పూర్తిగా అమెరికాపై యాపిల్ దృష్టి కేంద్రీకరించింది. చైనా నుంచి ఎగుమతి చేసే ఐఫోన్లపై అధిక సుంకాలు ఉండటంతో యాపిల్ భారత్లో ఉత్పత్తిని వేగవంతం చేసింది. మార్చి-మే మధ్య కాలంలో భారత్ నుంచి 3.2 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసింది. మార్చిలో రికార్డు స్థాయిలో 1.3 బిలియన్ డాలర్లు, మేలో 1 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు పంపింది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే 4.4 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఇది గతేడాదిలో ఎగుమతైన 3.7 బిలియన్ డాలర్ల ఐఫోన్ల విలువ కంటే ఎక్కువ. భారత్పై విధించిన అదనపు 26 శాతం సుంకాలను జులై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో అదనపు సుంకాన్ని నివారించేందుకు భారత్ చర్చలు కొనసాగిస్తోంది. ఈ 90 రోజుల వ్యవధిని ఉపయోగించుకొని ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇక 10 శాతం బేస్లైన్ సుంకం కొనసాగుతుంది. మరోవైపు చైనా, అమెరికా దేశాలు సుంకాలను తగ్గించే ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి. భారతదేశంలో తయారీ రంగంలో రోజురోజుకూ విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్ఐ స్కీమ్ నేపథ్యంలో టాప్ కంపెనీలు కూడా తమ ప్రొడెక్ట్స్ తయారీను భారత్లోనే ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
చైనాను అధిగమించిన భారత్
ఐఫోన్ ఎగుమతుల్లో భారతదేశం చైనాను ఇప్పటికే అధిగమించింది. అమెరికాలో భారతదేశంలో ఉత్పత్తి చేసిన ఐఫోన్ ప్రొడెక్ట్స్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని నివేదికల్లో ఈ విషయం వెల్లడైంది. భారతదేశంలో ఐఫోన్ ప్రొడెక్ట్స్ ఎగుమతులు సంవత్సరానికి 76 శాతం వృద్ధిని సాధించాయి. ఈ అభివృద్ధికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై విధించిన 30 శాతం పరస్పర సుంకం కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారుది. ట్రంప్ నిర్ణయంతో భారతదేశం నుంచి అమెరికన్ మార్కెట్కు ఐఫోన్ ఎగుమతులు భారీగా పెరిగాయి. భారతదేశం ఏప్రిల్లో దాదాపు 3 మిలియన్ ఐఫోన్లను (లేదా 30 లక్షల యూనిట్లు) అమెరికాకు ఎగుమతి చేసింది అయితే చైనా నుంచి ఈ షిప్మెంట్లు కేవలం 9,00,000 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. 2020లో కోవిడ్ కారణంగా ఎక్స్పోర్ట్ చెయిన్లో ఏర్పడిన అంతరాయాల దృష్ట్యా ఆపిల్ చైనా బయటి దేశాల్లో తయారీ కార్యకలాపాలను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న భారత్ దేశంలో ఐఫోన్ ఉత్పత్తుల తయారీకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. యూఎస్ ఐఫోన్ల డిమాండ్ ప్రతి త్రైమాసికంలో 20 మిలియన్ వరకు ఉంది. కానీ భారతదేశం 2026 వరకు ఈ లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com