Financial Rules : క్రెడిట్ స్కోర్ ఇక వారం వారం అప్‌డేట్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.

Financial Rules : క్రెడిట్ స్కోర్ ఇక వారం వారం అప్‌డేట్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.
X

Financial Rules : కొత్త సంవత్సరం 2026 జనవరి 1 నుంచి భారతదేశంలో అనేక కీలకమైన ఆర్థిక నిబంధనలు మారబోతున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా బ్యాంకింగ్, లోన్ సర్వీసులను ప్రభావితం చేస్తాయి. గతంలో క్రెడిట్ బ్యూరోలు వినియోగదారుల క్రెడిట్ హిస్టరీని 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ చేసేవి. ఇకపై, ఈ ప్రక్రియ వారానికి ఒకసారి తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల రుణాలు తీసుకునే వారికి తమ స్కోరు వేగంగా అప్‌డేట్ అవ్వడం ద్వారా త్వరగా ప్రయోజనం లభిస్తుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించినందున, అనేక బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. దీని ఫలితంగా, కొత్తగా రుణాలు తీసుకునేవారికి లేదా ఇప్పటికే ఉన్న లోన్లపై వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది. పాన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి. గడువులోగా లింక్ చేయని వారికి జనవరి 1 నుంచి ముఖ్యమైన బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవచ్చు.

సోషల్ మీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో కూడా జనవరి 1 నుంచి కొన్ని కొత్త నియంత్రణలు రాబోతున్నాయి.

సిమ్ వెరిఫికేషన్: వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లు తమ వినియోగదారుల సిమ్ కార్డులను క్రమం తప్పకుండా వెరిఫై చేయాలని ప్రభుత్వం కొత్త నియమాన్ని తీసుకువచ్చింది. ఇది నకిలీ ఖాతాలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

పిల్లలకు సోషల్ మీడియా ఆంక్షలు: ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల మాదిరిగానే, భారతదేశంలో కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త సంవత్సరంలో ఈ నియమం ఎప్పుడైనా అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

డెలివరీ వాహనాలకు ఈవీ కారు తప్పనిసరి: డెలివరీ సేవల కోసం పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం తప్పనిసరి చేయాలని కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాలు ఈ నియమాన్ని అమలులోకి తీసుకురావచ్చు.

జీతాలు, రైతు పథకాలపై మార్పులు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో, రైతులకు సంబంధించిన పథకాల్లో కూడా కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఎనిమిదో వేతన సంఘం: ఏడవ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. కాబట్టి, కొత్త సంవత్సరం నుంచి ఎనిమిదో వేతన సంఘం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

రైతులకు పీఎం కిసాన్ ఐడీ: ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు రైతులకు ప్రత్యేక ఐడీ కార్డులు జారీ చేస్తున్నాయి. పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బు పొందడానికి ఈ ఐడీ కార్డు తప్పనిసరి కావచ్చు.

పీఎం కిసాన్ పంటల బీమా విస్తరణ: పీఎం కిసాన్ పంటల బీమా పథకం కవరేజ్ పెంచారు. అడవి జంతువుల దాడి కారణంగా పంట నష్టం జరిగినా రైతులకు పరిహారం లభిస్తుంది.

ఇంధన ధరల సవరణ

ప్రతి నెల ప్రారంభంలో మాదిరిగానే, 2026 జనవరి 1న ఎల్‌పీజీ గ్యాస్, ఏటీఎఫ్ విమాన ఇంధన ధరలను సవరించనున్నారు. ఈ ధరల సవరణ సామాన్య ప్రజలపై, విమానయాన రంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

Tags

Next Story