OIL RATES: యుద్ధ బీభత్సం.. చమురు ధరలకు రెక్కలు

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు వేడెక్కుతున్నాయి. అమెరికా ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవడంతో పరిణామాలు మరింత సున్నితంగా మారాయి. అమెరికా జరిపిన బాంబు దాడులు, ఇరాన్ అణు కేంద్రాల లక్ష్యంగా దాడులు జరపడం, హర్మూజ్ జల మార్గాన్ని మూసివేతకు సిద్ధపడటంతో అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఈ ఉద్రిక్తతలతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7 శాతం పెరిగి 79.12 డాలర్లకు చేరగా, యూఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8 శాతం ఎగబాకి 75.98 డాలర్లను తాకింది. ఇది గత ఐదు నెలల్లో గరిష్ఠ స్థాయిగా మార్కెట్లు గుర్తించాయి. చమురు సరఫరాపై భయాల నేపథ్యంలో ఇంధన వ్యయాలు పెరగనున్నాయన్న అంచనాలతో మార్కెట్లు దిగజారుతున్నాయి.
ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం
యుద్ధం ముప్పు, పెరిగిన చమురు ధరలు ఆసియా మార్కెట్లపై నెగటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.4 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.7 శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐరోపా, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లూ ఒత్తిడిలో ఉన్నాయి. ఎస్అండ్పీ 500 ఫ్యూచర్స్ 0.5 శాతం, నాస్డాక్ ఫ్యూచర్స్ 0.6 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఔన్సు ధర 0.1 శాతం తగ్గి 3,363 డాలర్లుగా ఉంది. మొత్తంగా ప్రపంచ మార్కెట్లే కాదు, సామాన్య భారతీయుడి జేబుపైనా ఈ యుద్ధ ప్రభావం పడనుంది.
భారత్కు ఎదురవుతున్న సవాళ్లు
ఈ ఉద్రిక్తతలు భారత్కు పెద్ద మైనస్గా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు దిగుమతులపై ఆధారపడి ఉన్న భారత్కు ధరల పెరుగుదల పెనుభారం కానుంది. అదే సమయంలో పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్య సంబంధాలు కూడా ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల దిశగా మన ఎగుమతులు అడ్డంకులు ఎదుర్కోవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ నుంచి వెళ్లే సరుకులు తగ్గుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రమైతే, భారత్కు ఇంధన వినియోగ వ్యయాలతో పాటు వాణిజ్య రంగంలోనూ షాక్ తప్పదని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com