RBI New Rules 2026: ఆర్బీఐ సంచలన నిర్ణయం..ఆన్లైన్ మోసానికి గురైతే బ్యాంకే డబ్బులు ఇస్తుంది.

RBI New Rules 2026: డిజిటల్ విప్లవం పుణ్యమా అని బ్యాంకింగ్ సేవలు మన అరచేతిలోకి వచ్చేశాయి. కానీ, అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. అకౌంట్లో డబ్బులు మాయమవ్వడం ఒకెత్తయితే, లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు మరొక ఎత్తు. సామాన్య ఖాతాదారుడు ఎదుర్కొంటున్న ఇలాంటి అనేక సమస్యలకు చెక్ పెడుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన కొత్త ప్రతిపాదనలు బ్యాంకింగ్ రంగం రూపురేఖలను మార్చడమే కాకుండా, ఖాతాదారులకు కొండంత అండగా నిలవనున్నాయి.
ఆన్లైన్ మోసం జరిగితే మీ డబ్బులు వెనక్కి
డిజిటల్ లావాదేవీల సమయంలో జరిగే చిన్న చిన్న మోసాల వల్ల సామాన్యులు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. ఇకపై అలాంటి భయం అవసరం లేదు. స్మాల్ వాల్యూ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ ఫ్రేమ్వర్క్ కింద, అనాథరైజ్డ్ లావాదేవీలు జరిగితే ఖాతాదారులకు గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం అందించేలా ఆర్బీఐ కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. అంటే మీ ప్రమేయం లేకుండా మీ ఖాతా నుంచి చిన్న మొత్తంలో డబ్బు మాయమైతే, ఆ నష్టాన్ని బ్యాంకే భరించాల్సి ఉంటుంది. దీనివల్ల సామాన్య ప్రజలకు డిజిటల్ బ్యాంకింగ్పై నమ్మకం మరింత పెరుగుతుంది.
రికవరీ ఏజెంట్ల వేధింపులకు చరమగీతం
లోన్ కట్టడం ఆలస్యమైతే చాలు, రికవరీ ఏజెంట్లు చేసే ఫోన్ కాల్స్, ఇంటికి వచ్చి చేసే గొడవలు ఖాతాదారులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. దీనిపై ఆర్బీఐ సీరియస్ అయ్యింది. రికవరీ ఏజెంట్ల నియామకం, వారు పనిచేసే విధానంపై కఠినమైన మార్గదర్శకాలను సమీక్షిస్తోంది. కస్టమర్లను భయభ్రాంతులకు గురిచేయడం, అగౌరవంగా ప్రవర్తించడం ఇకపై చెల్లదు. బ్యాంకులే నేరుగా ఈ ఏజెంట్ల ప్రవర్తనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏజెంట్లు నిబంధనలు అతిక్రమిస్తే సదరు బ్యాంకులపై ఆర్బీఐ భారీ జరిమానాలు విధించనుంది.
మిస్-సెల్లింగ్ కు చెక్.. చిన్న వ్యాపారులకు వరం
బ్యాంకు సిబ్బంది తమ టార్గెట్ల కోసం కస్టమర్లకు అవసరం లేని ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్టులను బలవంతంగా అంటగడుతుంటారు. దీనినే మిస్-సెల్లింగ్ అంటారు. దీనిని అరికట్టడానికి ఆర్బీఐ కఠినమైన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ను తీసుకువస్తోంది. ఇకపై బ్యాంకు ఏ ప్రాడక్ట్ అమ్మాలన్నా కస్టమర్కు పూర్తి సమాచారం ఇవ్వాల్సిందే. మరోవైపు, చిన్న తరహా పరిశ్రమల కోసం షూరిటీ లేదా గ్యారెంటీ లేని లోన్ల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి సులభంగా పెట్టుబడి దొరుకుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
