Stock Market Crash : దలాల్ స్ట్రీట్లో క్షిపణి దాడి..సెన్సెక్స్ 2700 పాయింట్లు ఢమాల్..17 లక్షల కోట్లు గోవిందా.

Stock Market Crash : పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో భారత స్టాక్ మార్కెట్ సోమవారం నాడు అతలాకుతలమైంది. వారం ప్రారంభంలోనే దలాల్ స్ట్రీట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెను పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ ఏకంగా 2,743 పాయింట్లు కుప్పకూలి 78,543 వద్ద ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్ల గుండెలు ఆగిపోయినంత పని అయింది. ఈ భారీ పతనంతో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 17.50 లక్షల కోట్లు ఆవిరైపోయింది. గత 11 నెలల కనిష్ట స్థాయికి సెన్సెక్స్ పడిపోవడం మార్కెట్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నిఫ్టీ కూడా 533 పాయింట్లు నష్టపోయి 24,645 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
ఈ వినాశనానికి ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్లో మారిన యుద్ధ సమీకరణాలే. ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయెల్, గల్ఫ్ ప్రాంతాలపై విరుచుకుపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో భయాందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 6 శాతం పెరిగి 77 డాలర్లకు చేరుకున్నాయి. చమురు ధరలు పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందనే భయంతో ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించడానికి పోటీ పడ్డారు.
మార్కెట్ పతనంలో ఇండీగో, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ వంటి దిగ్గజ షేర్లు 2 నుంచి 4 శాతం వరకు నష్టపోయాయి. రియల్టీ, ఆటో, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు కుదేలయ్యాయి. అయితే యుద్ధం కారణంగా రక్షణ రంగం బలోపేతం అవుతుందనే అంచనాతో భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కొన్ని షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. బార్క్లేస్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లకు చేరుకోవచ్చని హెచ్చరించడం మార్కెట్ సెంటిమెంట్ను మరింత దెబ్బతీసింది.
ప్రస్తుతానికి సెన్సెక్స్ కొంత కోలుకుని 1100 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నప్పటికీ, ముప్పు ఇంకా తొలిగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోతే రాబోయే రోజుల్లో మార్కెట్ మరిన్ని కనిష్టాలను చూడవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్ల ఆశలన్నీ ఇప్పుడు అంతర్జాతీయ శాంతి చర్చలపైనే ఉన్నాయి. ఒకవేళ యుద్ధం మరింత ముదిరితే, భారత మార్కెట్లు కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు. చిన్న ఇన్వెస్టర్లు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
