Interest Rates : లోన్ తీసుకునే వాళ్లకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వడ్డీ రేట్లు.

Interest Rates : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును తగ్గించడంతో బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేట్ల తగ్గింపు పర్వం మొదలైంది. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ రుణగ్రహీతలకు ఊరటనిచ్చేలా వడ్డీ రేట్లను సవరించాయి. ఈ జాబితాలో తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేరింది. హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలకు, కొత్తగా రుణాలు తీసుకోవాలనుకునే వారికి భారీ ఉపశమనం లభించనుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 18, 2025 నుంచి అమలులోకి వచ్చాయి.
యూనియన్ బ్యాంక్ ఎంత తగ్గించింది?
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రుణాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించింది. హోమ్ లోన్పై వడ్డీ రేటును ఏడాదికి 7.45 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గించగా (0.30% తగ్గింపు), కార్ లోన్పై వడ్డీ రేటును 7.90 శాతం నుంచి 7.50 శాతానికి (0.40% తగ్గింపు) కుదించింది. ఇక అన్నింటికంటే ఎక్కువగా పర్సనల్ లోన్పై ఏకంగా 1.60 శాతం తగ్గింపునిస్తూ వడ్డీ రేటును 10.35 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గించింది. వీటితో పాటు పర్యావరణ హితమైన గ్రీన్ ఫైనాన్స్ హోమ్, కార్ లోన్లపై అదనంగా 0.10 శాతం రాయితీని కూడా బ్యాంక్ అందిస్తోంది.
ఎస్బీఐ కూడా రేట్లను తగ్గించింది
యూనియన్ బ్యాంక్ కంటే ముందే దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను సవరించింది. ఎస్బీఐ అన్ని కాలాలకు వర్తించే ఎంసీఎల్ఆర్ ను ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనివల్ల పాత రుణగ్రహీతలకు కూడా ఈఎంఐ భారం తగ్గనుంది. అయితే, రుణాలతో పాటు డిపాజిట్ రేట్లను కూడా ఎస్బీఐ స్వల్పంగా తగ్గించింది. గరిష్ట డిపాజిట్ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అమృత్ వృష్టి పథకం కింద 444 రోజుల డిపాజిట్పై వడ్డీ రేటును 6.6 శాతం నుంచి 6.45 శాతానికి సవరించింది.
ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు నేపథ్యం
డిసెంబర్ 5న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకువచ్చింది. 2025 సంవత్సరంలో వడ్డీ రేటును తగ్గించడం ఇది నాలుగోసారి కాగా, ఈ ఏడాది మొత్తం రెపో రేటు తగ్గింపు 125 బేసిస్ పాయింట్లుగా ఉంది. బ్యాంక్ తన ప్రకటనలో రుణగ్రహీతలకు అప్పుల భారాన్ని తగ్గించి, ఆర్థికంగా వారికి మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ రేట్లను సవరించినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

